తమ స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అన్నాడు. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయారని చెప్పిన సల్మాన్ అఘా.. బ్యాటింగ్లో పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోవడం తమ పతనాన్ని శాసించిందని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 114 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సల్మాన్ అఘా.. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు బౌలింగ్, బ్యాటింగ్ చేయలేకపోయామని తెలిపాడు.
'ఈ రోజు మా స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయారు. అయితే మా స్పిన్నర్లపై మాకు నమ్మకం ఉంది. గత 6 నెలలుగా వారు అద్భుతంగా రాణిస్తున్నారు. బ్యాటింగ్లో పవర్ప్లేలోనే మేము చాలా వికెట్లు కోల్పోయాం. అది మా పతనాన్ని శాసించింది. తొలి ఇన్నింగ్స్లో పిచ్ కొంచెం జిగటగా ఉంది. బంతి కూడా గ్రిప్ అయ్యింది. కానీ కండిషన్స్కు తగ్గట్లు మేం సరైన చోట బంతులు వేయలేకపోయాం. తొలి ఇన్నింగ్స్ కంటే రెండో ఇన్నింగ్స్లో పిచ్ బ్యాటింగ్కు మెరుగ్గా సహకరించింది.
ఇలాంటి హై-వోల్టేజ్ మ్యాచ్ల్లో భావోద్వేగాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడాలి. మేం ఇప్పటికే ఇలాంటి మ్యాచ్లు చాలా ఆడాం. ఇక రెండు రోజుల్లోనే మాకు మరో మ్యాచ్ ఉంది. ఈ ఓటమిని మరిచి దానిపై దృష్టి పెట్టాలి. ఆ మ్యాచ్లో గెలిచి సూపర్-8కు అర్హత సాధించడమే మా ముందున్న ఏకైక లక్ష్యం. అక్కడి నుంచి మళ్లీ ఒక కొత్త టోర్నమెంట్ మొదలవుతుంది.'అని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో 3 ఫోర్లతో 32), శివమ్ దూబే(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 27) విలువైన పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయుబ్(3/25) మూడు వికెట్లు తీయగా.. ఉస్మాన్ తారిక్(1/24), సల్మాన్ అఘా, షాహిన్ షా అఫ్రిదిలకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 44) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(2/17), అక్షర్ పటేల్(2/29), వరుణ్ చక్రవర్తీ(2/17), హార్దిక్ పాండ్యా(2/16) రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ పడగొట్టారు.