తమ జట్టు ప్రపంచానికి భిన్నంగా ఆలోచిస్తుందని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అన్నాడు. అమెరికాతో మ్యాచ్లో టాస్ గెలిస్తే తాము ముందుగా బ్యాటింగ్ చేసేవాళ్లమని చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అన్నీ జట్లు ఒకలా ఆలోచిస్తే తమ జట్టు ఆలోచన వాటికి భిన్నంగా ఉంటుందని చెప్పాడు. సమష్టి ప్రదర్శనతోనే అమెరికాపై విజయం సాధించామని తెలిపాడు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాతో కొలంబో వేదికగా మంగళవారం జరిగిన తమ రెండో మ్యాచ్లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 32 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 190 పరుగులు చేయగా.. అమెరికా 158 పరుగులే చేసి ఓటమిపాలైంది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షాహిబ్జాదా ఫర్హాన్(41 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 73)తో పాటు ఉస్మాన్ తారిఖ్(3/27), షాదాబ్ ఖాన్(2/26) అమెరికా పతనాన్ని శాసించారు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సల్మాన్ అలీ అఘా పరిపూర్ణమైన ప్రదర్శనతో విజయం సాధించామని సంతోషం వ్యక్తం చేశాడు.

'నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. నేను నవ్వకుండా ఉండటం మీరు ఎప్పుడైనా చూశారా? (నవ్వుతూ). ఇదొక పరిపూర్ణమైన విజయం. గత మ్యాచ్లో మేం మిడిల్ ఓవర్లలో బాగా బ్యాటింగ్ చేయలేదు. కానీ ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడాం. 190 పరుగులు చేసిన తర్వాత ఆ లక్ష్యాన్ని కాపాడుకోగలమని మాకు తెలుసు. టాస్ గెలిచి ఉంటే నేను బ్యాటింగే ఎంచుకునేవాడిని. మాకున్న బౌలింగ్ దళంతో 160-170 పరుగులు చేసినా సునాయసంగా గెలుస్తాం. ఆ నమ్మకం నాకుంది. బ్యాటింగ్ ఎందుకు ఎంచుకోవాలనుకున్నానంటే.. మేం పాకిస్థాన్.. ప్రపంచం చేసే దానికి భిన్నంగా ఆలోచిస్తాం.
లక్ష్య ఛేదనలో మేం చాలా సౌకర్యవంతంగా ఉంటాం. మా బ్యాటింగ్ ఆర్డర్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. టాప్-3 ఆటగాళ్లు ఎప్పుడూ ఒకే ఆర్డర్లో ఆడుతారు. కానీ తర్వాతి బ్యాటర్లు పరిస్థితులకు తగ్గట్లు మారుతుంటారు. వికెట్లు పడకపోతే వచ్చి దూకుడుగా ఆడే ఫినిషర్లు, వికెట్లు పడితే ఆచితూచి ఆడుతూ మ్యాచ్ను ఆఖరి వరకు తీసుకెళ్లే బ్యాటర్లు కూడా ఉన్నారు. పవర్ ప్లేలో మేం ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేయాలి. ఈ రోజు ప్రదర్శన బాగానే ఉంది. కానీ ఇంకా మెరుగ్గా రాణించగలం.'అని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు.