న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిట్నెస్ అప్డేట్ను ఫ్యాన్స్.. అతని సతీమణి సాక్షి సింగ్నే అడిగి తెలుసుకున్నారు. 'వదినా.. అన్న ఎట్లుండు?'అని గట్టిగా అరుస్తూ సాక్షి సింగ్ను ఆరా తీసారు. దీనికి సాక్షి సింగ్ కూడా ఓపికగా సమాధానమిచ్చింది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఐపీఎల్ 2024 సీజన్లో ధోనీ బరిలోకి దిగుతాడని తెలిపింది.
ప్రస్తుతం ధోనీ రిహాబిలిటేషన్లో ఉన్నాడని, పూర్తి ఫిట్నెస్ సాధించడంపై ఫోకస్ పెట్టాడని పేర్కొంది. ఆమె మాటలు అభిమానులకు వినబడకపోవడంతో చేతులతో సైగలు చేసి వారికి అర్థమయ్యేలా వివరించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మహీ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది.

ఐపీఎల్ 2023 సీజన్లో మోకాలి గాయంతో ఇబ్బంది పడిన మహేంద్ర సింగ్ ధోనీ.. టోర్నీ అనంతరం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నాడు. స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్లో నిపుణుడు అయిన దిన్షా పార్దివాలా ఈ శస్త్ర చికిత్స చేయగా.. ప్రస్తుతం ధోనీ కోలుకుంటున్నాడు. ఇటీవలే జిమ్ ట్రైనింగ్ కూడా ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్గా మారాయి.
మరోవైపు సినీ నిర్మాతగా అవతారమెత్తిన సాక్షి సింగ్.. తమిళంలో 'ఎల్జీఎం' పేరిట సినిమాను తీసారు. రమేశ్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ మూవీలో హరీశ్ కల్యాణ్ - ఇవానా ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 4వ తేదీన ఈ సినిమాను తెలుగు, తమిళంతో పాటు హిందీలో విడుదల చేయనున్నారు.
ఈ మూవీ ప్రమోషన్స్లో చురుకుగా పాల్గొంటున్న సాక్షి సింగ్కు ధోనీ అభిమానుల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో అభిమానులు ధోనీ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వినోద ప్రపంచం పట్ల ఉన్న ఆసక్తితోనే తాను సినిమాల నిర్మాణం వైపు అడుగేసానని సాక్షి సింగ్ తెలిపింది.
ప్రతీ ఇంట్లో ఉండే ప్రధాన సమస్యే ఇతివృత్తంగా తీసుకొని ఎల్జీఎమ్ సినిమా తీసినట్లు తెలుస్తోంది. అటు తల్లి.. ఇటు సతీమణి మధ్య నలిగిపోతూ కొడుకు పడే కష్టాలు ఈ సినిమాలో చూపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. చెన్నైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కు ధోనీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.