న్యూఢిల్లీ: రెజ్లర్ల ఉద్యమం నుంచి తాను తప్పుకున్నట్లు వస్తున్న వార్తలను భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఖండించింది. ఇవన్నీ తప్పుడు వార్తలని ట్విటర్ వేదికగా స్పష్టం చేసింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్ట్ చేయాలని గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
శనివారం జరిగిన ఈ సమావేశంలో రెజ్లర్లకు అమిత్ షా నుంచి స్పష్టమైన హామీ లభించలేదని తెలుస్తోంది. అయితే ఈ సమావేశం అనంతరం సాక్షి మాలిక్ రెజర్లు చేస్తున్న పోరాటం నుంచి తప్పుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఆమె తిరిగి తన రైల్వే ఉద్యోగం చేరినట్లు వరుస కథనాలు వచ్చాయి.

ఈ ప్రచారంపై సాక్షి మాలిక్ ట్విటర్ వేదికగా స్పందించింది. న్యాయం దక్కేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. 'రెజ్లర్ల ఉద్యమం నుంచి నేను తప్పుకున్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. మాకు న్యాయం దక్కేవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. మాలో ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గరు.
ఆ ఆలోచన కూడా మాకు లేదు. రైల్వేలో ఉన్న నా బాధ్యతలను నిర్వర్తించేందుకే ఉద్యోగంలో చేరాను. అంత మాత్రాన మా పోరాటాన్ని ఆపేసినట్లు కాదు. దయచేసి ఎవరూ కూడా తప్పుడు ప్రచారం చేయవద్దు.'అని సాక్షి మాలిక్ ట్వీట్ చేసింది. సాక్షి మాలిక్తో పాటు బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగాట్లు రైల్వేలో విధులు నిర్వర్తిస్తున్నారు.
అయితే బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ అరెస్ట్ గురించి అమిత్ షా నుంచి ఎలాంటి హామీ లభించలేదని సాక్షి మాలిక్ భర్త సత్యవ్రత్ కడియన్ ఇండియా టుడేకు తెలిపారు. 'అమిత్ షా నుంచి మేం కోరుకున్న రియాక్షన్ రాలేదు. దాంతో మేం సమావేశం మధ్యలోనే బయటకు వచ్చేసాం. భవిష్యత్తులో మా పోరాటాన్నిఎలా చేయాలనేదానిపై ఫోకస్ పెట్టాం. వ్యూహాలు రచిస్తున్నాం. మేం ఈ పోరాటం నుంచి వెనక్కి తగ్గలేదు.'అని కడియన్ తెలిపారు.
అమిత్ షాను కలిసిన రెజ్లర్లలో సాక్షిమాలిక్, వినేశ్ ఫోగాట్, బజరంగ్ పూనియా ఉన్నారు. జూన్ 9లోపు బజరంగ్ పూనియాను అరెస్ట్ చేయకపోతే తమ పతకాలను గంగలో విసిరేస్తామని ఇప్పటికే రెజ్లర్లు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. అమిత్ షాను కలిసే ముందు రెజ్లర్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ను కూడా కలిసారు. నిష్పాక్షికమైన దర్యాప్తు జరుగుతుందని, రెజ్లర్ల కాస్త సహనంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.