టీమిండియా స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు తరఫున బరిలోకి దిగిన సాయి సుదర్శన్.. మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో తీవ్రంగా గాయపడ్డాడు. బ్యాటింగ్ సమయంలో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసే క్రమంలో పరుగు కోసం డైవ్ చేసినప్పుడు సాయి సుదర్శన్ గాయపడ్డాడు.
వెంటనే ఫిజియోలు అతన్ని హుటాహుటినా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు తరలించారు. అక్కడ అతనికి స్కానింగ్ తీయగా.. కుడి వైపు ఏడవ పక్కటెముక ముందు భాగంలో చిన్నపాటి చీలిక ఉన్నట్లు తేలింది. విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభంలో నెట్ ప్రాక్టీస్ సమయంలో కూడా సాయి సుదర్శన్కు సరిగ్గా అదే చోట దెబ్బ తగిలింది.
సాధారణంగా ఈ గాయం నుంచి కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుంది. దాంతో విజయ్ హజారే ట్రోఫీలతో పాటు రంజీ సీజన్ మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్న ఈ 24 ఏళ్ల క్రికెటర్.. ఐపీఎల్ 2026 సీజన్తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సాయి సుదర్శన్..బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు.

'గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి సాయి సుదర్శన్ లోయర్ బాడీ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ వ్యాయమానికి శరీరం బాగా సహకరిస్తోంది. వచ్చే ఏడు నుంచి పది రోజుల్లో నొప్పి తగ్గిన తర్వాత అప్పర్ బాడీ ట్రైనింగ్ ప్రారంభిస్తాం. ఆ తర్వాత క్రమంగా పూర్తి స్థాయి శిక్షణను అందిస్తాం.'అని సీఓఈ పేర్కొంది.
గతేడాది భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్.. ఇప్పటి వరకు 6 టెస్ట్ల్లో 27.45 సగటుతో 302 పరుగులు చేశారు. అలాగే మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ కూడా ఆడాడు. ప్రస్తుతం తమిళనాడు జట్టు తన గ్రూప్లో నాలుగు మ్యాచ్ల్లో ఒక విజయంతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. తదుపరి మ్యాచ్ల్లో రాజస్థాన్, త్రిపుర, కేరళతో తలపడనుంది.