భారత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుతో టీమిండియా జెర్సీ స్పాన్సర్ డ్రీమ్ 11 తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో సోషల్ మీడియా వేదికగా కొత్త చర్చ మొదలైంది. కాకతాళీయమో ఏమో కానీ ఇప్పటి వరకు టీమిండియాకు జెర్సీ స్పాన్సర్గా వ్యవహరించిన కంపెనీలన్నీ ఆర్థికంగా దివాలా తీసాయి. దాంతో టీమిండియాకు స్పాన్సర్స్ చేస్తే కంపెనీలు మూసుకోవాల్సిందే అనే చర్చ మొదలైంది. డ్రీమ్ 11 కంటే ముందు టీమిండియాకు బైజూస్, ఒప్పో, స్టార్, సహారా సంస్థలు జెర్సీ స్పాన్సర్గా వ్యవహరించాయి. ఇందులో సహారా సంస్థ సుదీర్ఘ కాలం జెర్సీ స్పాన్సర్గా ఉంది.
విచిత్రం ఏంటంటే ఈ కంపెనీలన్నీ దివాలా తీసాయి. సెబీ నిబంధనలు ఉల్లంఘించిన సహారా యజమాని జైలుకు వెళ్లగా.. చైనాతో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ఒప్పోను భారతీయులు బాయ్కాట్ చేశారు. దాంతో ఆ సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని జెర్సీ స్పాన్సర్ డీల్ నుంచి వైదొలిగింది. కాంపిటీషన్ కమిషన్ విచారణను ఎదుర్కొన్న స్టార్ ఇండియా.. జియో, స్పోర్ట్స్ 18తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఫ్లాట్ ఫామ్ అయిన బైజూస్ దివాళా తీసి.. స్పాన్సర్ డబ్బులు చెల్లించలేక డీల్ను రద్దు చేసుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుతో డ్రీమ్ 11 మూతపడింది. ఈ క్రమంలోనే టీమిండియాకు స్పాన్సర్స్ చేస్తే కంపెనీలు దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుందని సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ సాగుతోంది. టీమిండియా జెర్సీకి స్పాన్సర్ చేసేందుకు కూడా కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి.

ఈ కొత్త చట్టం ప్రకారం ఆన్లైన్ మనీ గేమ్లను ఆడితే గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా రూ. 1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ కొత్త బిల్లు క్రీడా రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. దేశంలో జరుగుతున్న క్రీడా టోర్నీలకు గేమింగ్ యాప్స్ సంస్థలే స్పాన్సర్ చేస్తున్నాయి. క్రికెట్తో పాటు ఇతర క్రీడా టోర్నీలకు కూడా కోట్ల రూపాయాలను వెచ్చిస్తున్నాయి. కానీ తాజా బిల్లు కారణంగా ఆ సంస్థలన్నీ తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమ నిపుణుల అంచనాల ప్రకారం, ఫాంటసీ గేమింగ్ సంస్థలు ఏటా ₹5,000 కోట్ల వరకు ప్రకటనల కోసం ఖర్చు చేస్తాయి, వీటిలో ఎక్కువ భాగం క్రికెట్కు సంబంధించిన టోర్నమెంట్లకే వెళ్తుంది. ఈ ఆదాయం పూర్తిగా తగ్గే అవకాశం ఉంది.
డ్రీమ్11 ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు అధికారిక జెర్సీ స్పాన్సర్గా ఉంది. ఈ సంస్థ బీసీసీఐతో 2023 నుంచి 2026 వరకు ₹358 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. డ్రీమ్ 11 కంపెనీకి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదంటే తాము ఒప్పందం రద్దు చేసుకుంటామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. కొత్త బిల్లు నేపథ్యంలో డ్రీమ్ 11 కీలక ప్రకటనను విడుదల చేసింది. డబ్బులు చెల్లించి ఆడే పోటీలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఉచితంగా ఆడుకునే ఆన్లైన్ సోషల్ గేమ్లుగా వాటిని మార్చేశామని తెలిపింది. ఇన్నాళ్లు రూల్స్ ప్రకారమే పనిచేశామని, భారత ప్రభుత్వ చట్టాలను గౌరవిస్తామని స్పష్టం చేసింది. తమ ఇతర సంస్థలు ఫ్యాన్ కోడ్, డ్రీమ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా క్రీడలతో అనుబంధాన్ని కొనసాగిస్తామని పేర్కొంది.