టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్పై మాజీ క్రికెటర్ సదగోప్పన్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియా కప్ 2025కు శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టాడు. గంభీర్కు నచ్చిన ఆటగాళ్లనే ఎంపిక చేస్తున్నాడని, నచ్చని ఆటగాళ్లను పక్కనపెట్టేస్తున్నాడని ఆరోపించాడు. ఆసియా కప్ 2025 కోసం భారత సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును గత మంగళవారం ఎంపిక చేసింది.
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్కు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం భారత టీ20 జట్టులో అయ్యర్కు చోటు లేదని భారత చీఫ్ సెలెక్టర్ అగార్కర్ తెలిపాడు. ఇంకొన్నాళ్లు అతను వేచి చూడాల్సిందేనన్నాడు. అయితే శ్రేయస్ అయ్యర్ను తప్పించడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ విన్నర్ అయిన అయ్యర్ను పక్కనపెట్టి టీమిండియా ఘోర తప్పిదం చేసిందని మండిపడుతున్నారు.

తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన సదగోప్పన్ రమేష్.. అయ్యర్ వేటు వెనుక గంభీర్ ఉన్నాడని ఆరోపించాడు. హెడ్ కోచ్గా గంభీర్ తీరు బాలేదని విమర్శించాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలో విదేశాల్లో టీమిండియా విజయాలు సాధిస్తే.. గంభీర్ పర్యవేక్షణలో మాత్రం ఓటములు, డ్రాలు చేసుకుంటుందన్నాడు. డ్రానే గొప్ప విజయంగా భావిస్తున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించాడు.
'ఆసియాకప్ 2025కు శ్రేయస్ అయ్యర్ను ఎంపికచేయాల్సింది. కానీ గౌతం గంభీర్ తనకు నచ్చిన ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేస్తున్నాడు. నచ్చని వాళ్లను పక్కనపెడుతున్నాడు. ఇదే యూఏఈ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. భారత వైట్బాల్ టీమ్లో అయ్యర్కు శాశ్వతంగా చోటు కల్పించాలి. ఆటగాళ్లు సూపర్ ఫామ్తో పాటు ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే అండగా నిలవాలి. అంతేకాకుండా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నప్పుడు కాదు. సూపర్ ఫామ్లో ఉన్న అయ్యర్ నుంచి ఆశించిన ఫలితాన్ని అందుకునేందుకు ఇదే సరైన సమయం.'అని సదగోప్పన్ రమేష్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు.
గౌతం గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. టెస్ట్ల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. న్యూజిలాండ్తో సొంతగడ్డపై మూడు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన భారత్.. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో కోల్పోయింది. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్ట్ల సచిన్-అండర్సన్ ట్రోఫీని 2-2తో డ్రా చేసుకుంది. అయితే ఈ డ్రాను గొప్ప విజయంగా భావిస్తున్నారని సదగోప్పన్ రమేష్ విమర్శలు గుప్పించాడు.
'గతేడాదిగా టెస్ట్ల్లో పేలవ ప్రదర్శన చేయడంతోనే ఇంగ్లండ్తో సిరీస్ను డ్రా చేసుకోవడం గొప్ప విజయంగా కనిపిస్తోంది. ఎందుకంటే కోహ్లీ-రవిశాస్త్రి పర్యవేక్షణలో విదేశీ గడ్డపై టీమిండియా వరుసగా విజయాలు సాధించింది. ప్రస్తుతం ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ డ్రా చేసుకోవడం గొప్ప ఘనతగా అనిపిస్తోంది.'అని సదగోప్పన్ రమేష్ చెప్పుకొచ్చాడు.