ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను ముంబై ఇండియన్స్ కరుణించింది. ముందుగా రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ సచిన్ వారుసుడిని ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. కనీస ధరకు కొనుగోలు చేసేందుకు కూడా ఆసక్తి చూపించలేదు.
గత సీజన్ వరకు అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్ కూడా అర్జున్ టెండూల్కర్ కోసం బిడ్ వేయలేదు. దాంతో అతను అన్సోల్డ్గా నిలిచిపోయాడు. అయితే వేలం మరికొద్ది క్షణాల్లో ముగుస్తుందనగా.. మరోసారి అర్జున్ టెండూల్కర్ను వేలం వేయగా ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షల కనీస ధరకు తీసుకుంది. సచిన్ టెండూల్కర్పై ఉన్న ప్రేమతోనే కొనుగోలు చేసినట్లు అర్థమైంది.
2021 నుంచి గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్ అతన్ని రూ. 20 లక్షల బేస్ ప్రైజ్కు కొనుగోలు చేసింది. ఈసారి కూడా ఆ జట్టే తీసుకుంది. ఇక ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ 2023లో అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడి మూడు వికెట్లు మాత్రమే తీసాడు.

వేలానికి ఒక్క రోజు ముందు ముంబైతో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్లో గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్ టెండూల్కర్ దారుణంగా విఫలమయ్యాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్ టెండూల్కర్ ఓవర్కు 12 పరుగుల చొప్పున 48 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(57 బంతుల్లో 11 ఫోర్లు, 10 సిక్సర్లతో 130 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో అర్జున్ టెండూల్కర్ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఈ ప్రదర్శనే అర్జున్ టెండూల్కర్ ఆక్షన్పై ప్రభావం చూపించింది. కానీ ముంబై కరుణించడంతో మరోసారి అతనికి క్యాష్ రిచ్ లీగ్ ఆడే అవకాశం దక్కింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అర్జున్ టెండూల్కర్ విఫలమైనా..రంజీ ట్రోఫీలో మాత్రం ఐదు వికెట్లతో అదరగొట్టాడు. కానీ ఫ్రాంచైజీలు ఈ ప్రదర్శనను పట్టించుకోలేదు.