భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కొత్త అధ్యక్షుడి కోసం బీసీసీఐ ఎన్నిక నిర్వహించనుంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడి రేసులో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
బోర్డు సభ్యులు కూడా సచిన్ టెండూల్కర్ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను సచిన్ టెండూల్కర్ కార్యాలయం ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది. బీసీసీఐలో ఏ పదవి చేపట్టేందుకు సచిన్ టెండూల్కర్ ఆసక్తిగా లేరని స్పష్టం చేసింది. ఈ మేరకు సచిన్ టెండూల్కర్కు చెందిన ఎస్ఆర్టీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
'బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో సచిన్ టెండూల్కర్ ఉన్నారని, నామినేట్ అయ్యారని జరుగుతున్న ప్రచారం మా దృష్టికి వచ్చింది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. బీసీసీఐలోని ఏ పదవిపై సచిన్ టెండూల్కర్కు ఆసక్తి లేదు. నిరాధారమైన ఊహాగానాలకు ప్రాధాన్యత ఇవ్వద్దని అందర్నీ కోరుతున్నాం.'అని ఆ ప్రకటనలో పేర్కొంది.

సెప్టెంబర్ 28న బీసీసీఐ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోనుంది. బీసీసీఐ ప్రెసిడెంట్తో పాటు వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పదవులను భర్తీ చేయనుంది. సౌరవ్ గంగూలీ అనంతరం 2022లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజర్ బిన్నీ మూడేళ్ల పదవికాలం త్వరలో ముగియనుంది. ప్రస్తుతం బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్గా రాజీవ్ శుక్లా ఉన్నారు.
భారత క్రికెట్ ముఖచిత్రంగా ఎదిగిన సచిన్ టెండూల్కర్.. వరల్డ్ బెస్ట్ బ్యాటర్గా గుర్తింపు పొందారు. రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో సచిన్ 200 టెస్ట్లు ఆడి 15921 పరుగులు చేశాడు. టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. 463 వన్డేల్లో 18426 పరుగులు చేసిన సచిన్.. ఒకే ఒక్క టీ20లో 10 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్గా కూడా రికార్డ్ అందుకున్నాడు. 2015-19 మధ్య బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా సచిన్ సేవలందించాడు.