
ముంబై: యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రాణాలను పనంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, రక్షణ సిబ్బంది కోసం భారత దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిషులు కష్టపడుతున్న ఈ ఫ్రంట్ లైన్ కార్మికులకు మద్దతుగా తన 47వ జన్మిదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
శుక్రవారంతో 47వ పడిలోకి అడుగుపెట్టనున్న మాస్టర్.. ఈ సారి జన్మిదిన వేడుకలకు దూరంగా ఉంటున్నాడని అతని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. 'జన్మదిన వేడుకలకు ఇది సరైన సమయం కాదని సచిన్ భావిస్తున్నాడు. కరోనాపై ముందు వరుసలో నిలిచి పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీసులు, రక్షణ సిబ్బందికి మద్దతు ఇవ్వడానికి ఇంతకంటే మంచి మార్గం లేదనుకుంటున్నాడు.'అని మాస్టర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కరోనా కట్టడికి తన వంతు సాయంగా పీఎం కేర్స్, మహారాష్ట్ర ప్రభుత్వ సహాయనిధికి ఈ భారత రత్నం రూ.50 లక్షల విరాళాన్ని అందజేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి 5 వేల కుటుంబాలకు నిత్యవసర వస్తువులు కూడా అందజేశాడు.
సచిన్ టెండూల్కర్ బర్త్ డే సందర్భంగా ఆయనకు ఉన్న కోట్లాది మంది పలు రకాల సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. సచిన్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని అరుదైన 40 ఫొటోలను ఓ ఫ్యాన్ క్లబ్ రిలీజ్ చేయనుంది.