టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్కు బిగ్ షాక్ తగిలింది. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్.. అసాధారణ ప్రదర్శనతో ఈ టోర్నీ ప్రారంభించాడు. కానీ మూడు మ్యాచ్ల వ్యవధిలోనే గోవా తుది జట్టు నుంచి వేటుకు గురయ్యాడు.
దేశవాళీ టీ20 టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ మధ్యలోనే అర్జున్ టెండూల్కర్ వేటుకు గురయ్యాడు. కానీ విజయ్ హజారే ట్రోఫీలో ఒడిశాతో జరిగిన తొలి మ్యాచ్తో గోవా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అర్జున్ టెండూల్కర్(3/61) మూడు వికెట్లతో సత్తా చాటాడు. హరియాణాతో జరిగిన రెండో మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయని అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్లో 14 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్లో గోవా ఓటమిపాలైంది. మణిపూర్తో జరిగిన మూడో మ్యాచ్లో అర్జున్ 26 పరుగులు చేయడంతో పాటు ఓ వికెట్ తీసాడు. ఈ మ్యాచ్లో గోవా 171 పరుగుల భారీ తేడాతో గెలిచింది.

అయితే ఉత్తరాఖండ్తో జరగాల్సిన మూడో మ్యాచ్లో గోవా తుది జట్టు నుంచి అర్జున్ టెండూల్కర్ వేటుకు గురయ్యాడు. పాయింట్స్ టేబుల్లో గ్రూప్-ఏలో ఉన్న గోవా మూడు మ్యాచ్ల్లో 2 గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. రెండో రౌండ్కు అర్హత సాధించేందుకు గోవా రేసులో ఉంది. ఒకవేళ గోవా ముందంజ వేస్తే అర్జున్ రీఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.
ఈ సీజన్ రంజీ ట్రోఫీలో అర్జున్ టెండూల్కర్ ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. నాగాలాండ్తో జరిగిన ప్లేట్ గ్రూప్లో ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ప్లేట్ గ్రూప్లో నాలుగు మ్యాచ్లు ఆడిన అర్జున్ 16 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో అర్జున్ టెండూల్కర్ను ముంబై ఇండియన్స్ అతని కనీస ధర రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. 2021లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ 2023లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడి మూడు వికెట్లు పడగొట్టాడు.
విజయ్ హజారే ట్రోఫీ ద్వారా అర్జున్ టెండూల్కర్ అరుదైన ఘనతను సాధించాడు. వైట్ బాల్ క్రికెట్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 2021లో ముంబై తరఫున దేశవాళీ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్ 41 వైట్ బాల్ మ్యాచ్ల్లో 51 వికెట్లు పడగొట్టాడు. 17 లిస్ట్ ఏ మ్యాచ్లో ఈ లెఫ్టార్మ్ పేసర్ 24 మంది బ్యాటర్లను ఔట్ చేశాడు. 24 టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు.
దేశవాళీ క్రికెట్లోకి రాకముందు అర్జున్ టెండూల్కర్ ముంబై తరఫున జూనియర్ లెవెల్ క్రికెట్ ఆడాడు. అండర్ 19 జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. 2022/23 రంజీ సీజన్కు ముందు అర్జున్ టెండూల్కర్ ముంబై నుంచి గోవాకు మారాడు. గోవా తరఫునే లిస్ట్-ఏతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అరంగేట్ర ఫస్ట్ క్లాస్ మ్యాచ్లోనే అర్జున్ టెండూల్కర్ సెంచరీతో సత్తా చాటాడు.
17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో అర్జున్ టెండూల్కర్ 37 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో ఒకసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. అతని తండ్రి సచిన్ టెండూల్కర్ 310 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. కానీ ఒక్కసారి కూడా ఐదు వికెట్ల ఘనతను అందుకోలేదు.