
న్యూఢిల్లీ: టెస్ట్ మ్యాచ్లకు పూర్వ వైభవం రావాలంటే బౌలర్లకు అనుకూల పరిస్థితులు ఉండాల్సిందేనని టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ఓ టెస్టు మ్యాచ్ ఎన్ని రోజుల్లో పూర్తయిందనే దాని కంటే.. అది ఆసక్తికరంగా సాగిందా? లేదా? అన్నదే ముఖ్యమని అన్నాడు.
ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మూడు మ్యాచ్లు రెండున్నర రోజుల్లోనే ముగియడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత్ తమకు అనుకూలమైన స్పిన్ పిచ్లతో విజయం సాధించిందని ఆసీస్ మాజీ క్రికెటర్లు ఆరోపించారు. దాంతో నాలుగో టెస్ట్కు ఫ్లాట్ వికెట్ సిద్దం చేయగా.. ఫలితం తేలకుండా ముగిసింది.
ఇక ఇండియా టుడే కాన్క్లేవ్ 2023 కార్యక్రమంలో పాల్గొన్న సచిన్.. టెస్ట్ క్రికెట్ పూర్వవైభవం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'టెస్టు మ్యాచ్ ఎలాంటి పిచ్ కండిషన్స్లోనైనా ఆడాల్సిందే. వికెట్పై ఎక్కువ పేస్, బౌన్స్, స్వింగ్, అతి స్పిన్ కూడా ఉండొచ్చు.

పిచ్ ఎలా ఉన్నా ఆట జనరంజకంగా సాగిందా? లేదా? అన్నదే కీలకం. మ్యాచ్ ఎన్ని రోజుల్లో ముగిసిందనేది కూడా అనవసరం. ఐసీసీ, ఎంసీసీ ఇతర క్రికెట్ సంస్థలు టెస్టు క్రికెట్కు ఎలా ఆదరణ పెంచాలని ఆలోచిస్తున్నాయి. సంప్రదాయక ఫార్మాట్ను నంబర్వన్గా నిలబెట్టాలనుకుంటున్నాయి.
అయితే ఇక్కడ వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మూడు రోజుల్లో టెస్ట్ మ్యాచ్లు ముగియడం వల్ల వచ్చే ప్రమాదం ఏం లేదు. విదేశీ పర్యటనలకు వెళ్లే జట్లకు అనుకూల పిచ్లు లభించవు. పిచ్ల గురించి ఆలోచించడం బదులు అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా కఠిన సాధన చేయడంపై టీమ్స్ దృష్టి సారించాలి.
టెస్టు క్రికెట్ అత్యుత్తమ ఫార్మాట్గా ఉండాలంటే బౌలర్లకు అనుకూల పరిస్థితులు ఉండాల్సిందే. బౌలర్ విసిరే ప్రతి బంతి.. బ్యాటర్గా ఒక సవాల్గా నిలవాలి. బౌలర్ల చాలెంజ్కు బ్యాటర్లు కూడా సమాధానం చెప్పాలి. ఆ సవాల్ సరిగా లేకుంటే ఆట ఎలా ఆకర్షణీయంగా ఉంటుంది?. హోరాహోరీగా సాగితేనే ఆట ఆసక్తికరంగా ఉంటుంది'అని సచిన్ సూచించాడు.

రవిశాస్త్రి చెప్పినట్లు వన్డే క్రికెట్ బోర్ కొడుతుందని సచిన్ పేర్కొన్నాడు. ఈ ఫార్మాట్లో స్వల్ప మార్పులు చేయాల్సి ఉందని సచిన్ అభిప్రాయపడ్డాడు. రెండు కొత్త బంతులను ఉపయోగించడం వల్ల బ్యాటర్లకు అనుకూలం అయిపోయిందన్నాడు.
గతంలో మాదిరి రివర్స్ స్వింగ్ చేసే అవకాశం బౌలర్లకు లేకుండా పోయిందన్నాడు. దాంతో 15 ఓవర్ నుంచి మ్యాచ్ బోర్ కొడుతుందని చెప్పాడు. 50 ఓవర్ల ఫార్మాట్ను టెస్ట్ తరహాలో రెండు ఇన్నింగ్స్లు విభజించి ఆడించాలని, అప్పుడు ఆట రసవత్తరంగా మారడంతో పాటు మూడు బ్రేక్స్ వాణిజ్య పరంగా కలిసొస్తాయని సచిన్ సూచించాడు.