
ముంబై: టోక్యో పారాలింపిక్స్లో పాల్గొంటున్న భారత అథ్లెట్ల బృందానికి దేశమంతా అండగా నిలవాలని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పిలుపునిచ్చాడు. పారా అథ్లెట్ నిజమైన హీరోలని కొనియాడాడు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పారాలింపిక్స్లో భారత్ నుంచి 54 మంది పారా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే భారత బృందానికి విషెస్ తెలియజేస్తూ సచిన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశాడు. ఈ అథ్లెట్లు ప్యాషన్, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని సామాన్య ప్రజలకు కనువిప్పు కలిగిస్తారన్నాడు. వీళ్లు ప్రత్యేక అవసరాలు కలిగిన అథ్లెట్లు కాదని, అత్యద్భుత శక్తి కలిగిన అథ్లెట్లని కొనియాడాడు.
'పారాలింపిక్స్కు సమయం వచ్చింది. టోక్యోలో జరిగే ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్న 54 మందితో కూడిన భారత బృందం వెన్నంటి నిలవాలని భారత ప్రజలను కోరుతున్నా. వీళ్లంతా కేవలం ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన అథ్లెట్లు మాత్రమే కాదని, అసాధారణ సామర్థ్యం కలిగిన రియల్ లైఫ్ హీరోలు అని నేను ఎల్లప్పుడూ నమ్ముతా. అభిరుచి, నిబద్దత, దృడసంకల్పంతో ఏదైనా సాధించగలమని నిరూపించే వీళ్లు మనందరికీ స్పూర్తిదాయకం. వీళ్ల ప్రయాణం మనకో కనువిప్పు'అని సచిన్ పేర్కొన్నాడు.
ఒలింపిక్స్ పతక విజేతలు, క్రికెటర్లను మనం ఎలాగైతే సత్కరించి గౌరవిస్తామో.. అలాగే వీరిని కూడా ప్రోత్సహిస్తే మన సమాజం మరింత మెరుగవుతుందని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అలా కేవలం పారాలింపిక్స్లో పతకాలు సాధించేవారిని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కిరినీ గౌరవించాలని సూచించాడు. ఈ ఒలింపిక్స్లో భారత్ కనీసం పది పతకాలు సాధిస్తుందనే నమ్మకం ఉందన్నాడు. గత రియో పారాలింపిక్స్లో భారత్ నాలుగు పతకాలు సాధించిందని, ఆ సంఖ్య ఇప్పుడు పదికి చేరాలని క్రికెట్ దిగ్గజం అభిలాషించాడు. ఇందులో ఎవరు పతకాలు గెలిచినా గెలవకపోయినా తాను ప్రతి ఒక్కరి ఆటను సమానంగా చూస్తాన్నాడు. అక్కడ పాల్గొనే ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయకులని ప్రశంసించాడు. అలాగే వీరిని ప్రోత్సహించడంలో ప్రభుత్వం, కార్పొరేట్ శక్తులు కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నాడు.
వైకల్యం శరీరానికే కాని.. తమ సంకల్పానికి కాదని చాటుతూ ప్రపంచం నలుమూలల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. రెండంకెల పతకాలే లక్ష్యంగా భారత్ నుంచి 54 మంది బరిలోకి దిగుతున్నారు. రెగ్యులర్ ఒలింపిక్స్కు దీటుగా పారాలింపిక్స్ను నిర్వహించేందుకు సై అంటున్న జపాన్, మంగళవారం అట్టహాసంగా ఆరంభ సంబరాలు నిర్వహించేందుకు సిద్దమవుతోంది. సాయంత్ర 4.30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభంకానున్నాయి.
1972 నుంచి పారాలింపిక్స్లో బరిలోకి దిగుతున్న ఇండియా ఇప్పటివరకు 12 పతకాలు సాధించింది. ఇందులో 2016 రియో గేమ్స్లో రెండు గోల్డ్, ఒక సిల్వర్, ఒక బ్రాంజ్తో 43వ ప్లేస్లో నిలిచింది. అయితే ఈసారి ఆ సంఖ్యను మార్చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5 గోల్డ్ మెడల్స్తో కలిపి 15 పతకాలు గెలవాలని ప్లాన్స్ చేస్తోంది. ఇందుకోసం 54 మంది బరిలోకి దిగుతుండగా, 9 క్రీడాంశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి చాలా దేశాలు గేమ్స్ నుంచి వైదొలిగాయి. దీంతో ఈసారి ఇండియా టాప్-25లో ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.