ఐపీఎల్లో ఆరితేరడమే:
తాజాగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ... 'అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే.. వారు ఐపీఎల్లో ఆడి ఆరితేరడమే ఇందుకు కారణం. మా సమయంలో వసీం అక్రమ్, షేన్ వార్న్, మెక్డర్మట్, మెర్వ్ హ్యూస్, ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ను నేను అంతకుముందు ఎదుర్కోలేదు. ఆస్ట్రేలియానో లేదా పాకిస్థానో వెళ్లి ఆడితేనే వారి బౌలింగ్పై అంచనా వచ్చేది. ఇప్పుడు అలా లేదు. ఐపీఎల్ వల్ల అందరి బౌలింగ్ను ముందే ఎదుర్కొంటున్నారు' అని అన్నారు.
సూర్యకు వాళ్లేం కొత్తకాదు:
'అరంగేట్రానికి ముందే ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ఆడే అనుభవం ఐపీఎల్ వల్ల వస్తుందని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. 'నాలుగో టీ20లో జొఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ను ఎదుర్కొనేటప్పుడు సూర్యకు వాళ్లేం కొత్త కాదని వ్యాఖ్యాతలు చెప్పారు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ తరఫున రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లు ఆడినప్పుడు ఆర్చర్, స్టోక్స్ ఇద్దరి బౌలింగ్లో సూర్య ఆడాడు. వాళ్లు ఎలా బౌలింగ్ చేస్తారో అతడికి తెలుసు. ఇలాంటి అనుభవం ఉన్న కుర్రాళ్లు జట్టులోకి రావడంతో భారత రిజర్వ్ బెంచ్ బలం మరింత పెరుగుతోంది' అని క్రికెట్ దిగ్గజం చెప్పుకొచ్చారు.
మళ్లీ బ్యాట్ పట్టడం సంతోషంగా ఉంది:
రోడ్సేఫ్టీ వరల్డ్ సిరీస్ ద్వారా మళ్లీ మైదానంలోకి వచ్చి బ్యాట్ అందుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తోందని మాస్టర్ సచిన్ టెండూల్కర్ తెలిపారు. మాజీ సహచరులను ఈ విధంగా కలుసుకోవడం, వారితో క్రికెట్ ఆడడం బాగుందన్నారు. సచిన్ నేతృత్వంలోని ఇండియా లెజెండ్స్ టీమ్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ లెజెండ్స్తో బుధవారం హోరాహోరీగా సాగిన సెమీఫైలన్లో 12 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్తో తలపడనుంది.
రెచ్చిపోతున్న మాజీలు:
రోడ్సేఫ్టీ వరల్డ్ సిరీస్లో భారత మాజీలు రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 35 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఇర్ఫాన్ పఠాన్ 34 బంతుల్లో 61 పరుగులతో విజృంభించాడు. దక్షిణాఫ్రికా లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో యువరాజ్ సింగ్ ఏకంగా ఆరు సిక్సులు బాదాడు. సచిన్ టెండూల్కర్ 37 బంతుల్లో 60 రన్స్ చేశాడు. ఎస్ బద్రీనాథ్, యూసఫ్ పఠాన్ కూడా రాణించారు.