
భీకర పేస్ దళం..
1989లో పాకిస్థాన్తో టెస్టు సిరీస్ ద్వారా సచిన్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యునీస్తో కూడిన అత్యద్భుత పేస్ దళం పాక్ పక్షాన ఉంది. అందుకే 16 ఏళ్ల వయస్సులో వారిని ఎదుర్కోవడం సచిన్ వల్ల కాలేదు. బంతులన్నీ నేరుగా శరీరానికి తాకుతుండగా నొప్పిని భరిస్తూ తొలి ఇన్నింగ్స్లో కష్టంగా 15 పరుగులు చేయగలిగాడు. ఇక, ఈ మ్యాచ్ తర్వాత తనకు కెరీర్ ఉండదని, ఇదే చివరి మ్యాచ్ కావచ్చని సచిన్ భావించాడట.. కానీ ఇలాంటి పరిస్థితిలో రవిశాస్త్రి ఇచ్చిన సలహా కారణంగానే తాను నిలదొక్కుకోగలిగానని తాజాగా సచిన్ చెప్పాడు. స్కై స్పోర్ట్స్ నిర్వహించే 'నాసిర్ మీట్స్ సచిన్' షోలో సచిన్ ఈ విషయాలను వెల్లడించాడు.

'ఇదే నా మొదటి, చివరి మ్యాచ్..
క్రీజులో నిలదొక్కుకునేందుకే అవస్థలు పడ్డ తన మొదటి మ్యాచ్ అనుభవాలను పంచుకున్నాడు సచిన్. 'నా మొదటి మ్యాచ్ను స్కూల్ మ్యాచ్ ఆడినట్లు ఆడాను. వసీమ్, వకార్ షార్ట్ బంతులతోపాటు నన్ను భయపెట్టేందుకు అన్ని రకాల బంతులను సంధించారు. కొన్ని బంతులు నా శరీరానికి కూడా తగిలాయి. వారి పేస్కు తట్టుకోలేక 15 పరుగులకే ఔటై వెనుదిరిగాను. అనంతరం డ్రెస్సింగ్ రూంకి చేరుకొని, నేరుగా బాత్రూమ్కి వెళ్లి ఏడ్చినంత పని చేశా. ఇక టీంలో చోటు ఉండదని భావించా. అద్దంలో చూసుకొని 'ఇదే నా మొదటి, చివరి మ్యాచ్' అని అనుకున్నాను. నా స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాను అని బాధపడ్డాను' అని సచిన్ వెల్లడించాడు.

రవిశాస్త్రి చిట్కా..
'ఈ విషయాన్ని నా టీం సభ్యులు గమనించారు. ఈ సందర్భంగా నాకు, రవిశాస్త్రికి జరిగిన సంభాషణ నాకు ఇంకా గుర్తుంది. పాఠశాల మ్యాచ్ ఆడినట్లు ఆడావు. అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొన్నావు. వారి నైపుణ్యాన్ని గౌరవించాలి' అని రవిశాస్త్రి చెప్పినట్లు సచిన్ గుర్తు చేసుకున్నాడు. అలాగే వారి బౌలింగ్లో పరుగులు చేయలేనని బాధ పడకుండా క్రీజులో అర్ధగంట సమయం గడపాలని సూచించాడు. దీంతో వారి పేస్ నీకు అర్థమవుతుందని చెప్పాడు. ఈ చిట్కా నిజంగా అద్భుతంగా పని చేసింది.
'ఈ సలహాతోనే ఫైసలాబాద్లో జరిగిన తర్వాతి మ్యాచ్లో స్కోరు బోర్డును చూడలేదు. పరుగులు సాధించాలని ఆరాటపడలేదు. గడియారం వంకే చూశాను. అర్ధగంట తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ మ్యాచ్లో 59 పరుగులు చేశాను. ఆ మ్యాచ్ తర్వాత నా ఆలోచనల్లో మార్పు వచ్చింది' అని ఈ మాజీదిగ్గజం వెల్లడించాడు .


Click it and Unblock the Notifications












