
న్యూఢిల్లీ: తన సతీమణి అంజలి వల్లే వివాహం జరిగిందని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తెలిపాడు. ఇరు కుటుంబాలను అంజలినే ఒప్పించిందని చెప్పాడు. ఇక భారత్లో సచిన్ టెండూల్కర్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సచిన్.. రెండు దశాబ్దాలకు పైగా టీమిండియాకు తన సేవలు అందించాడు. ఎన్నో మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించడంతో సహా 100 అంతర్జాతీయ సెంచరీలు, వన్డేల్లో ఫస్ట్ డబుల్ సెంచరీ వంటి అనితర సాధ్యం కాని రికార్డులను నెలకొల్పాడు. క్రికెట్ గాడ్గా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
ఇక వ్యక్తిగత జీవితంలో సచిన్... 17 ఏళ్ల వయసులో అంజలీతో ప్రేమలో పడ్డాడు. తనకన్నా వయసులో దాదాపు ఆరేళ్లు పెద్ద అయిన అంజలీని 1995లో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. అయితే అంజలీతో వివాహానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని సచిన్ తాజాగా వెల్లడించాడు. రెండు కుటుంబాలనూ పెళ్లికి ఒప్పించే బాధ్యత అంజలీకే అప్పగించానని సచిన్ గుర్తు చేసుకున్నాడు.
'1994లో న్యూజిలాండ్ పర్యటన సమయంలో అది జరిగింది. ఆక్లాండ్, వెల్లింగ్టన్లలో వరుసగా చక్కని ఇన్నింగ్స్లు ఆడుతూ మంచి ఫామ్లో ఉన్నాను. అప్పుడే అంజలీ నన్ను కలిసి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. నేను సరే అన్నాను. కానీ రెండు కుటుంబాలతో నువ్వే మాట్లాడి ఒప్పించాలని చెప్పాను. అప్పటికే ఇంట్లో వారికి అంజలీతో పరిచయం ఉన్నా నాకు ఎందుకో పెళ్లి విషయం మాట్లాడాలి అంటే ఇబ్బందిగా అనిపించింది. అందుకే ఇరు కుటుంబాలను ఒప్పిస్తే రేపే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అంజలీతో అన్నాను. అంజలీనే మా పెళ్లి గురించి అందరినీ ఒప్పించింది"
అని సచిన్ చెప్పుకొచ్చాడు.
1995 మే 24న సచిన్-అంజలీ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి 1997లో సారా టెండూల్కర్, 1999లో అర్జున్ టెండూల్కర్ జన్మించారు. 24 ఏళ్ల పాటు టీమిండియాకు ఆడిన సచిన్ 2013లో వీడ్కోలు పలికాడు. మరోవైపు తండ్రి బాటలోనే అర్జున్ క్రికెటర్గా కెరీర్ ప్రారంభించాడు. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు ఎంపికయ్యాడు. గతేడాదితో పాటు తాజా వేలంలోను ముంబై ఇండియన్స్ అతన్ని తీసుకుంది.