World Cup 2023: ముంబైలోని వాంఖడే మైదానంలో ఏర్పాటు చేసిన సచిన్ టెండూల్కర్ విగ్రహంపై అభిమానులు మండిపడుతున్నారు. ఈ విగ్రహం సచిన్ టెండూల్కర్లా లేదని ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ను తలపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ కాలం భారత క్రికెట్కు సచిన్ టెండూల్కర్ అందించిన సేవలకు గుర్తింపుగానూ.. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.
బుధవారం ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంతి ఏక్నాథ్ షిండే సచిన్ స్టాచ్యూను ఆవిష్కరించారు. కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమానికి సచిన్, అతడి భార్య అంజలి, కూతురు సారా హాజరైంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవిస్, బీసీసీఐ, ఐసీసీ మాజీ చీఫ్ శరద్ పవార్, బీసీసీఐ కార్యదర్శి జై షా, కోశాధికారి అశీష్ షెలార్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా పాల్గొన్నారు.

'ఇది నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. ముంబై క్రికెట్ సంఘం బాధ్యులు విగ్రహం ఏర్పాటు విషయం చెప్పగానే నాకు సంతోషం వేసింది. ఎంతో గౌరవంగానూ భావించా. ఫ్రీగా ఈ మైదానానికి వచ్చి మ్యాచ్లు చూసిన నాకు.. ఈ స్టేడియంలో ఇంత గౌరవం దక్కడం గొప్పగా ఉంది'అని సచిన్ అన్నాడు.
ఇక ఈ విగ్రహం సచిన్లా లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విగ్రహం ఏర్పాటు విషయంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ తప్పిదం చేసిందని, ఇది ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ను తలపిస్తుందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఈ విగ్రహం చూసిన తర్వాత సచిన్ కూడా ఇదే అనుకొని ఉంటాడని సెటైర్లు పేల్చుతున్నారు.
ఈ విగ్రహం, స్మిత్ ఫొటోలను పక్కపక్కన పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వాంఖడే మైదానంలో స్మిత్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, అతనికి భారత్లో గొప్ప గౌరవం దక్కిందని సెటైర్లు పేల్చుతున్నారు. స్మిత్ అభిమాని ఈ విగ్రహం చేసి ఉంటాడని సెటైర్లు పేల్చుతున్నారు. మరికొందరు మాత్రం యుక్త వయసులో ఉన్న సచిన్ విగ్రహం అని, ట్రోల్ చేయడం సరికాదని సూచిస్తున్నారు.