Sachin Tendulkar, IND vs NZ 1st semi-final: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అసాధారణ ప్రదర్శనతో తన హృదయాన్ని గెలుచుకున్నాడని కొనియాడాడు. వన్డేల్లో తాను నెలకొల్పిన అరుదైన రికార్డును కోహ్లీ అధిగమించడంపై సంతోషం వ్యక్తం చేశాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ శతక్కొట్టాడు. వన్డేల్లో 50 సెంచరీలు నమోదు చేసి ఈ ఘనతను అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డ్ను కోహ్లీ అధిగమించాడు.

వన్డేల్లో వరల్డ్ రికార్డ్ సాధించిన నేపథ్యంలో విరాట్ కోహ్లీని ట్విటర్ వేదికగా సచిన్ ప్రశంసించాడు. కోహ్లీని తొలిసారి కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. 'కోహ్లీ.. భారత డ్రెస్సింగ్ రూమ్లో నిన్ను మొదటి సారి కలిసినప్పుడు సహచర ఆటగాళ్లంతా నా కాళ్లు మొక్కాలని ప్రాంక్ చేశారు. ఆ రోజు నేను తెగ నవ్వుకున్నాను.
ఆ రోజు నువ్వు నా కాళ్లు మొక్కకపోయినా.. ఈ రోజు ఆటపై నీకున్న పిచ్చి, నైపుణ్యంతో నా హృదయాన్ని టచ్ చేశావ్. ఓ కుర్రాడు వరల్డ్ క్లాస్ ప్లేయర్లా ఎదగడం చూసిన నేను చాలా సంతోషంగా ఫీలవుతున్నాను. ఓ ఇండియన్గా నా రికార్డ్ను అధిగమించావని నేను సంతోషించడం లేదు. వరల్డ్ కప్లో సెమీస్ వంటి బిగ్ మ్యాచ్లో నా హోమ్ గ్రౌండ్లో ఈ రికార్డ్ అధిగమించడం నా సంతోషాన్ని డబుల్ చేసింది.'అని సచిన్ ట్వీట్ చేశాడు.
ఇండియా ఇన్నింగ్స్ అనంతరం కోహ్లీని స్వయంగా కలిసి సచిన్ అభినందించాడు. అధికారిక బ్రాడ్కాస్టర్తో కూడా మాట్లాడాడు.
'విరాట్ కోహ్లీకి అభినందనలు. చాలా ఈజీగా ఈ వరల్డ్ రికార్డ్ అందుకున్నాడు. వన్డేల్లో సునాయసంగా 50 శతకాలు బాదాడు. అతని ప్రదర్శన పట్ల మేం గర్వపడుతున్నాం.'అని తెలిపాడు. టీమిండియాలోకి కొత్తగా వచ్చినప్పుడు సచిన్ ఆశీర్వాదం తీసుకోవాలని, కెరీర్లో గొప్ప స్థాయికి చేరుతావని, ఇది టీమ్ సంప్రదాయమని సీనియర్ ఆటగాళ్లు కోహ్లీని ఆటపట్టించారు. సచిన్ ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.
కోహ్లీ కాళ్లు మొక్కబోతుంటే అడ్డుకున్నానని, ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగి తెగ నవ్వుకున్నానని తెలిపాడు.