
ముంబై: క్రికెట్ గాడ్, టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనా సెకండ్ వేవ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చాడు. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు 'మిషన్ అక్సిజన్'అనే సంస్థకు తన వంతుగా కోటీ రూపాయాల ఆర్థిక సాయాన్ని అందజేశాడు. ఈ విషయాన్ని మాస్టరే ట్విటర్ వేదికగా ప్రకటించాడు.
250 మందికి పైగా యువకులతో మిషన్ ఆక్సిజన్ సంస్థ వైరస్ బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు పనిచేస్తోంది. దేశంలో మొదటి సారి కరోనా విపత్తు సంభవించినప్పుడు ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళాన్ని అందజేసిన మాస్టర్.. స్వచ్చంద సంస్థలతో కలిసి పేద ప్రజలకు నిత్యవసర వస్తువులు కూడా అందజేశాడు. ఇక రోడ్ సేఫ్టీ వరల్డ్ సూపర్ సిరీస్ సందర్భంగా కరోనా బారిన పడిన మాస్టర్ కోలుకున్నాడు. గతేడాదే ప్లాస్మా డొనేషన్ సెంటర్ను ప్రారంభించిన మాస్టర్.. తన 48వ జన్మదినం సందర్భంగా ప్లాస్మా డొనేట్ చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. కరోనాపై పోరేడేందుకు ఎప్పుడూ ముందుంటున్న మాస్టర్పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇక ఇప్పటికే ప్యాట్ కమిన్స్, బ్రెట్ లీ, శ్రీవత్స్ గోస్వామి, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కరోనా బాధితులకు అండగా విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. కమిన్స్ 50వేల డాలర్లు, బ్రెట్ లీ ఒక బిట్ కాయిన్, గోస్వామి రూ.90 వేలు, రాజస్థాన్ రాయల్స్ 7.5 కోట్ల విరాళాలన్ని ప్రకటించింది.