ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగే పటౌడీ ట్రోఫీని అండర్సన్-టెండూల్కర్గా పేరు మార్చడంపై తీవ్ర దుమారం రేగుతోంది. పటౌడీ పేరును ఎందుకు తొలగించారని మాజీ క్రికెటర్ల కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్లు ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇది సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ వివాదాంపై తాజాగా సచిన్ టెండూల్కర్ స్పందించారు. ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ఒక రోజు ముందు సచిన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ పేరు మార్పు విషయంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈసీబీ, బీసీసీఐ కలిసి తీసుకున్న నిర్ణయమని తెలిపారు.
'పటౌడీ ట్రోఫీ పేరు మార్పు నిర్ణయంలో నా ప్రమేయం లేదు. బీసీసీఐ, ఈసీబీ కలిసి తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాతే నాకు సమాచారం ఇచ్చారు. పటౌడీ కుటుంబం భారత క్రికెట్కు చేసిన కృషిని నేను గౌరవిస్తాను. సీనియర్ పటౌడీ ఇంగ్లండ్తో పాటు భారత జట్టుకు ఆడారు. టైగర్ పటౌడీ భారత జట్టుకు కెప్టెన్గా విశేష సేవలు అందించారు.

పటౌడీ వారసత్వాన్ని సజీవంగా ఉంచాలి. అందుకోసం నేను చేయగలిగినదంతా చేశాను. ఈ వివాదం తలెత్తిన తర్వాత నేను పటౌడీ కుటుంబంతో మాట్లాడాను. ఐసీసీ ఛైర్మెన్ జై షాతో పాటు బీసీసీఐ, ఈసీబీ అధికారులతో చర్చలు జరిపాను. పటౌడీ వారసత్వాన్ని కొనసాగించడానికి ఏదో ఒకటి చేయాలని వారికి సూచించాను. ఈ చర్చల తర్వాత పటౌడీ పేరును ఈ సిరీస్తో ఉండేలా.. విజేత కెప్టెన్ను పటౌడీ మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ను అందజేయాలని నిర్ణయించారు. నేను ఎప్పుడూ సీనియర్ ఆటగాళ్లను గౌరవిస్తాను.'అని సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చారు.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. లీడ్స్ వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఈ సిరీస్తోనే డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్ మొదలవ్వనుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యువ సారథి శుభ్మన్ గిల్ ఏ మేరకు రాణిస్తాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇరు జట్లు ఈ సిరీస్ కోసం సిద్దమయ్యాయి. సన్నాహకాలను పూర్తి చేసుకున్నారు. 2007 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా సిరీస్ గెలవలేదు. కనీసం ఈ సారైనా విజయం సాధించాలనే పట్టుదలతో టీమిండియా ఉంది.