
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీ నెంబర్ 7తో పాటు భారత క్రికెట్ దిగ్గజాల జెర్సీ నెంబర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వీడ్కోలు పలకాలని మాజీ క్రికెటర్ సాబా కరీమ్ సూచించాడు. సుదీర్ఘ కాలం భారత క్రికెట్కు వారు చేసిన సేవలకు గాను ఇలా జెర్సీలకు వీడ్కోలు పలికి గౌరవం ఇవ్వాలన్నాడు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్గా గుర్తింపు పొందిన ధోనీ.. తన సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ భారత్కు అందించిన విషయం తెలిసిందే. తద్వారా ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచిన ఏకై సారథిగా మహీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
బుధవారమే 40వ వసంతలోకి అడుగుపెట్టిన మహీకి యావత్ క్రికెట్ ప్రపంచం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ క్రమంలోనే ధోనీ సేవలను కొడియాడిన సాబా కరీమ్.. అతని నెంబర్ 7 జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించాలన్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైనప్పటికీ మహీ యువకులకు మార్గనిర్దేశం చేయగలడని పేర్కొన్నాడు 'ధోనీ జెర్సీ మాత్రమే కాదు మరికొందరు భారత దిగ్గజాల జెర్సీలకు బీసీసీఐ వీడ్కోలు పలకాలి. వారు ధరించిన జెర్సీ నంబర్లను ఇతరులు వాడకుండా చూడాలి. భారత క్రికెట్ను ముందుకు తీసుకెళ్లిన దిగ్గజాలకు ఇదో గుర్తింపు. వారిని ఇలా గౌరవించుకోవచ్చు' అని సాబా కరీమ్ చెప్పుకొచ్చాడు.
ధోనీ అంతర్జాతీయ క్రికెట్ ఆడనప్పటికీ భారత కుర్రాళ్లకు అతను దారిచూపే దీపం కాగలడని కరీమ్ తెలిపాడు. అతను గనుక టీమిండియా మెంటార్ ఉంటే.. భారత క్రికెట్ సేఫ్ హ్యాండ్స్ చేతిలో ఉన్నట్లేనన్నాడు. 'ధోనీ భారత క్రికెట్కు సేవలు కొనసాగిస్తాడనే అనుకుంటున్నా. చెన్నై సూపర్కింగ్స్ తరఫున అతడెంతో మంది యువకులను తీర్చిదిద్దాడు. రాష్ట్ర స్థాయిలోనూ కుర్రాళ్లకు మార్గనిర్దేశం చేయాలి. అలాగైతే భారత క్రికెట్ భవిష్యత్తుకు మంచి జరుగుతుంది' అని సాబా కరీమ్ చెప్పుకొచ్చాడు.