
పాపం అక్షర్..
శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకోవడం మంచి నిర్ణయమేనని, కానీ అక్షర్ను పక్కనపెట్టాల్సింది కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఐపీఎల్ సెకండాఫ్లో 12 మ్యాచ్లు ఆడిన అక్షర్ పటేల్ 15 వికెట్లు తీశాడు. ఇక టీమిండియా రివైజ్డ్ టీమ్పై స్పందించిన సబా కరీమ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా కోసమే సెలెక్టర్లు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డాడు.
మెగాటోర్నీలో అతనికి బ్యాకప్గా శార్దూల్ను తుది జట్టులోకి ఎంపిక చేశారని చెప్పాడు. 'జట్టులో చాలా మంది స్పిన్నర్లున్నారనే చర్చ బాగా జరిగింది. దాంతో అక్షర్ పటేల్ను తప్పించి పేసర్ను తీసుకోవాలని భావించినట్లున్నారు. అయితే మంచి ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ను తప్పించడం కఠినమైన నిర్ణయమే.

పాండ్యాకు బ్యాకప్గా..
హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గానే సెలెక్టర్లు శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకొచ్చారు. ఠాకూర్ను ఎంపిక చేయడం మంచి నిర్ణయమే. ఫిట్నెస్ సమస్యలతో ఏమైనా ఇబ్బందులు ఉంటే హార్దిక్ పాండ్యా స్థానంలో శార్దూల్ను ఆడించవచ్చని టీమ్మేనేజ్మెంట్ భావిస్తుంది. హార్దిక్ పాండ్యా ఓ మ్యాచ్ విన్నర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతనో మంచి బ్యాటింగ్ ఆల్రౌండర్.
అతను మళ్లీ బౌలింగ్ చేయగానికి కొంత సమయం పట్టవచ్చు. అతను గనుక బౌలింగ్ చేస్తే ఆరో బౌలింగ్ ఆఫ్షన్గా టీమిండియాకు గొప్ప ఆస్థిగా మారుతాడు. అందుకే వరుసగా విఫలమవుతున్నా అతన్ని జట్టులోకి తీసుకున్నారు'అని ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో సబాకరీమ్ చెప్పుకొచ్చాడు.

బౌలింగ్ చేయకున్నా..
ఐపీఎల్ సెకండాఫ్లో హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. అటు బ్యాటింగ్లో సత్తా చాటకపోగా.. బౌలింగ్లో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. దాంతో అతన్ని టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ సెలెక్షన్ కమిటీ మాత్రం అతనికి అండగా నిలిచింది. హార్దిక్ బౌలింగ్ చేయకున్నా బ్యాట్స్మన్గా జట్టులో కొనసాగుతాడని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.
'హార్దిక్ పాండ్యా విషయంలో ఓ స్పష్టతతోనే ఉన్నాం. హార్దిక్ బౌలింగ్ చేయకున్నా బ్యాట్స్మన్గా కొనసాగుతాడు. టోర్నీ మధ్యలో అతను ఫిట్ అయితే బౌలింగ్ చేయవచ్చు. ప్రస్తుతానికి అయితే అతను బౌలింగ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అక్షర్ పటేల్ విషయంలో తీసుకున్న నిర్ణయం కఠినమైనదే. కానీ జట్టులో స్పిన్నర్లుగా జడేజా, అశ్విన్లు ఉండడంతో పేస్ బౌలింగ్లో సమతూకం పాటించడానికి శార్దూల్ను జట్టులోకి తీసుకొని అక్షర్ను స్టాండ్ బై ప్లేయర్గా ఉంచాం.''అని ఆ అధికారి పేర్కొన్నాడు.

టీమిండియా రివైజ్డ్ టీమ్..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ
స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్
సన్నాహక ఆటగాళ్లు: అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, లుక్మన్ మెరివాలా, వెంకటేశ్ అయ్యర్, కర్ణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతమ్


Click it and Unblock the Notifications












