న్యూఢిల్లీ: సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాడు జట్టులో ఉండటం ముంబై ఇండియన్స్ జట్టు అదృష్టమని భారత మాజీ క్రికెటర్ సబా కరీమ్ అన్నాడు. మైదానంలో నలువైపుల బౌండరీలు బాదే సామర్థ్యం సూర్య సొంతమని, అతనో భిన్నమైన ఆటగాడని కొనియాడాడు. జట్టు అవసరాలకు తగ్గట్లు అతని బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకోవచ్చన్నాడు. ఇక గత ఏడాదిన్నరకాలంగా టీ20ల్లో నిలకడగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆడిన ఫస్ట్ బాల్నే సిక్స్ బాదిన సూర్య.. తన ఫస్ట్ ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఆ ఫామ్ను అలానే కొనసాగిస్తూ.. సుదీర్ఘ ఫార్మాట్కు ఎంపికయ్యాడు. అయితే కరోనా కారణంగా టెస్ట్ల్లో అరంగేట్రం చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య చివరి టెస్ట్ రద్దవ్వడంతో యూఏఈకి చేరుకొని ఐపీఎల్కు సమాయత్తం అవుతున్నాడు.
కరోనాతో అర్థంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ యూఏఈ వేదికగా రీస్టార్ట్ కానుంది. ఆదివారం డిఫెండిగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్తో ఈ ధనాధన్ లీగ్ సందడి మొదలుకానుంది. ఈ నేపథ్యంలోనే సూర్యకుమార్ యాదవ్ గురించి సబా కరీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'సూర్యకుమార్ యాదవ్ ఏ దశలోనైనా బౌండరీలు కొట్టగలడు. అలానే బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన నెం.3, నెం.4లో బరిలోకి దిగి యాంకర్ ఇన్నింగ్స్ ఆడగలడు. ఇలాంటి బ్యాట్స్మెన్ టీమ్లో ఉండటం నిజంగా ముంబై ఇండియన్స్ అదృష్టం. అతనిపై ముంబై టీమ్ ఎక్కువగా ఆధారపడుతోంది. కాబట్టి.. రాబోవు సీజన్లలో కూడా అతన్ని ఆ ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకుంటుంది'అని సబా కరీమ్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2021 సీజన్ మొదటి దశలో ఏడు మ్యాచ్లాడిన ముంబై ఇండియన్స్.. నాలుగు మ్యాచ్ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడు మ్యాచ్ల్లో ఆడిన సూర్యకుమార్ యాదవ్ 144.16 స్ట్రైక్రేట్తో 173 పరుగులు చేశాడు. అదే జోరును అరబ్ గడ్డపై చూపించేందుకు సిద్దమవుతున్నాడు.
టీ20 ప్రపంచకప్పై మాట్లాడిన సబాకరీం.. టాప్-4 టీమ్స్ను అంచనా వేసాడు. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్కు అగ్రతాంబూలం వేసిన సబా కరీం.. ఇంగ్లండ్, భారత జట్లకు కూడా టీ20 ప్రపంచకప్ 2021 సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇక నాలుగో స్థానం కోసం దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య పోటాపోటీ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. గత టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన విండీస్.. కీరన్ పొలార్డ్ సారథ్యంలోని ప్రస్తుత జట్టు కూడా ఆ ఫలితాన్ని పునరావృతం చేసే అవకాశం ఉందన్నాడు. స్టార్ ప్లేయర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారని, విండీస్ నుంచి ఇతర జట్లకు పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నాడు.