న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్లో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్ సెట్ అయ్యిందని, యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చోటు దక్కడం కష్టమేనని మాజీ సెలెక్టర్ సబా కరీం అన్నాడు. ఫినిషర్ రోల్లో దినేశ్ కార్తీక్ అదరగొడుతుండటంతో పంత్కు అవకాశం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డాడు. అయితే జట్టులో లెఫ్టాండర్స్ లేరని, రిషభ్ పంత్ను తుది జట్టులోకి తీసుకోవాలనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ల్లో ఎవరికి అవకాశం దక్కుతుందా? అనే చర్చ మొదలైంది.
టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగేముందు టీమిండియా చివరిసారిగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతోంది. తొలి టీ20లో దినేశ్ కార్తిక్తోపాటు రిషభ్ పంత్కూ అవకాశం కల్పించింది. కానీ బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి రాలేదు. ఇంతకుముందు వచ్చిన అవకాశాలను రిషభ్ పంత్ పెద్దగా అందిపుచ్చుకోలేదు. పొట్టి ఫార్మాట్లో మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. అయితే ఆసీస్తో జరిగిన సిరీస్లో కార్తిక్ మాత్రం తన 'ఫినిషర్' పాత్రకు న్యాయం చేశాడు. ఈ క్రమంలో రిషభ్ పంత్కు అవకాశంపై టీమ్ఇండియా మాజీ సెలెక్టర్ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు.
'రిషభ్ పంత్ను కాదని టీమిండియా మేనేజ్మెంట్ దినేశ్ కార్తిక్ వైపు మొగ్గు చూపడం మంచి నిర్ణయంగా అనిపిస్తోంది. ఆరో స్థానంలో కార్తిక్ లాంటి హిట్టర్ ఉండాలనుకోవడం తప్పేమీలేదు. రిషభ్ పంత్ను అలాంటి పాత్రలో ఎప్పుడూ ప్రయత్నించలేదు. అందుకే రిషభ్ పంత్కు తుది జట్టులో అవకాశం వస్తుందా..? అనేది నా అనుమానం. ఎందుకంటే ఇప్పటికే మంచి కాంబినేషన్ టీమిండియాకు దొరికిందని భావిస్తున్నా' అని సబా కరీం విశ్లేషించాడు. అక్టోబర్ 23న టీ20 ప్రపంచకప్లో భారత్ తొలి మ్యాచ్లో పాక్తో తలపడనుంది. ఇప్పటికే 15 మందితో కూడిన ప్రధాన జట్టును టీమిండియా ప్రకటించింది. దినేశ్ కార్తిక్తోపాటు రిషభ్ పంత్నూ ఎంపిక చేసింది.