న్యూఢిల్లీ: మితిమీరిన రక్షణాత్మక ధోరణి ఆస్ట్రేలియా ఓటమిని శాసించిందని టీమిండియా మాజీ క్రికెటర్ సబా కరీం తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్తో ఆదివారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఓ చానెల్తో మాట్లాడిన సబా కరీం.. ఇరు జట్ల ఆటతీరును విశ్లేషించాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్ల అతి జాగ్రత్తే కొంపముంచిందని చెప్పాడు.
'ఆస్ట్రేలియా ఓటమికి ప్రధాన కారణం వారి ఆట తీరే. వన్డేప్రపంచకప్లో భారత్తో ఆడుతున్నప్పుడు జాగ్రత్త పడటం ముఖ్యమే. కానీ దూకుడు ఆడాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ ఆసీస్ ఆటగాళ్లు మాత్రం డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ చేశారు. రక్షణాత్మకంగా ఆడటం ముఖ్యమే కానీ వారు శృతిమించిన డిఫెన్సివ్ ఆటతీరును ప్రదర్శించారు.

చెన్నై పిచ్ గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురైనట్లు అనిపించింది. ఆసీస్ ఆటగాళ్లు కాస్త దూకుడుగా ఆడి ఉంటే కనీసం 260-270 పరుగులు చేసేవారు. అప్పుడు ఫలితం వారికి అనుకూలంగా ఉండేది.
ఇక టీమిండియా విషయానికి వస్తే.. రోహిత్ శర్మ బౌలర్లను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో సరైన సమయంలో బౌలింగ్ వేయించి ఫలితం రాబట్టాడు. రవీంద్ర జడేజా అసాధారణ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. లైన్ అండ్ లెంగ్త్తో పాటు వేరియేషన్స్ చూపించాడు. సుదీర్ఘ కాలం తర్వాత వన్డే క్రికెట్ ఆడిన అశ్విన్ సైతం ఆకట్టుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో రోహిత్ బౌలింగ్ అటాక్ను అద్భుతంగా నడిపించాడు.
జస్ప్రీత్ బుమ్రా సైతం బంతితో సత్తా చాటాడు. మిచెల్ మార్ష్ను ఔట్ చేసి శుభారంభం అందించిన అతను..ఈ టోర్నీలో కీలకం కానున్నాడు. అతని వర్క్లోడ్ మేనేజ్మెంట్ను జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసాధారణ బ్యాటింగ్తో చిరస్మరణీయ విజయాన్ని అందించారు.'అని సబా కరీం చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్(71 బంతుల్లో 5 ఫోర్లతో 46), డేవిడ్ వార్నర్(52 బంతుల్లో 6 ఫోర్లతో 41) రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/28) మూడు వికెట్లుతీయగా.. కుల్దీప్ యాదవ్(2/42), జస్ప్రీత్ బుమ్రా(2/35) రెండేసి వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్లకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(116 బంతుల్లో 6 ఫోర్లతో 85), కేఎల్ రాహుల్(115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 97 నాటౌట్) అసాధారణ ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ ఓ వికెట్ పడగొట్టాడు.