న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వికెట్ కీపర్గా అతను సాధించిన ఘనతలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. రెప్పపాటులో స్టంపింగ్స్ చేయడం.. వికెట్లను చూడకుండానే రనౌట్లు చేయడం.. ఇప్పటికీ ఎందరికో అంతుచిక్కని డీఆర్ఎస్ను ధోనీ రివ్యూ సిస్టమ్ అనేట్టుగా మార్చేయడం ధోనీకే సాధ్యమైంది.
అత్యధిక క్యాచ్లు, స్టంపౌట్లు చేసిన ప్లేయర్గా కూడా ధోనీ రికార్డు సృష్టించాడు. ఇక వికెట్ కీపర్గా ప్రత్యర్థి బ్యాటర్ల కదిలికలను గమనించి బౌలర్లతో వ్యూహాలు రచించడం కూడా ధోనీ నుంచే మొదలైంది. నాలుగు పదుల వయసులో ఇంకా ఐపీఎల్ ఆడుతున్న ధోనీ.. బ్యాటింగ్లో తడబడుతున్నా కీపింగ్లో మాత్రం అతనికి తిరుగులేదు. ఈ తరం వికెట్ కీపర్లు కూడా ధోనీతో పోటీ పడలేరు.

అలాంటి బెస్ట్ వికెట్ కీపర్ అయిన ధోనీని.. కెరీర్ ఆరంభంలో కీపింగ్ సరిగ్గా చేయడం లేదని రిజెక్ట్ చేశారంట. టీమిండియా మాజీ సెలెక్టర్ సబా కరీం ఈ విషయాన్ని వెల్లడించాడు. వికెట్ కీపర్గా ధోనీ ఫుట్వర్క్ సరిగ్గా లేదని పక్కనపెట్టామని గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ వికెట్ కీపర్ అయిన సబా కరీం ధోనీ సెలెక్షన్కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
'మహేంద్ర సింగ్ ధోనీని తొలిసారి రంజీ క్రికెట్ ఆడుతుండగా చూశాను. అప్పుడు అతను బిహార్ తరఫున ఆడేవాడు. సెలెక్టర్గా అతని బ్యాటింగ్, వికెట్ కీపింగ్ స్కిల్స్ను దగ్గర నుంచి గమనించా. అతని బ్యాటింగ్కు ఫిదా అయ్యా. స్పిన్, పేస్ బౌలింగ్ అనే తేడా లేకుండా ధాటిగా ఆడాడు. అయితే వికెట్ కీపర్గా అతని ఫుట్వర్క్ సరిగ్గా లేదు.
వెంటనే ధోనీకి ఈ విషయం తెలియజేశాను. కీపర్గా ఫుట్వర్క్ మెరుగుపరుచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించా. ఈ మాటలను సీరియస్గా తీసుకున్న ధోనీ కీపర్గా ఎంతో మెరుగయ్యాడు. కెన్యాలో భారత్-ఏ, పాకిస్థాన్-ఏ, కెన్యా-ఏ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్లో మహేంద్ర సింగ్ ధోనీకి ఆడే అవకాశం దక్కింది. ఆ సిరీస్లో అతని వికెట్ కీపింగ్ చాలా అద్భుతంగా అనిపించింది.

ఫుట్వర్క్ చాలా మెరుగుపరుచుకున్నాడు. బ్యాటింగ్లో అయితే ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఆ సిరీస్ అతని కెరీర్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ధోనీ గురించి సౌరవ్ గంగూలీని ప్రత్యేకంగా కలిసి చెప్పాను. టీమిండియా కోరుకునే వికెట్ కీపర్ బీహార్ టీమ్లో ఉన్నాడని తెలియజేసాను. ధోనీ ఆట గురించి తెలియని గంగూలీ పెద్దగా పట్టించుకోలేదు.
దాంతో ధోనీ పాకిస్థాన్ టూర్కు ఎంపికవ్వలేదు. ఆ తర్వాత ధోనీ ఆటను చూసిన గంగూలీ అతన్ని వెంటనే జట్టుకు ఎంపిక చేయాలని సూచించాడు.'అని సబా కరీం గుర్తు చేసుకున్నాడు. 2004 బంగ్లాదేశ్ పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ధోనీ..తొలి మ్యాచ్లో డకౌటయ్యాడు.