సౌతాఫ్రికా20 లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హ్యాట్రిక్ పరాజయాలతో ఈ టోర్నీ ప్రారంభించిన డిఫెండింగ్ ఛాంపియన్ సన్రైజర్స్.. వరుసగా మూడు విజయాలు సాధించింది. ప్రిటోరియా క్యాపిటల్స్తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ 52 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్(55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సన్రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు చేసింది. మార్క్రమ్ హాఫ్ సెంచరీతో రాణించగా.. మార్కో జాన్సెన్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 24), లియమ్ డాసన్(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 25) మెరుపులు మెరిపించారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్.. మార్కో జాన్సెన్(4/13), లియమ్ డాసన్(3/17) ధాటికి 16.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. కీగన్(28), మార్క్యూస్(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్రైజర్స్ బౌలర్లలో జాన్సెన్, డాసన్లకు తోడుగా రిచర్డ్ గ్లీసన్, ఓట్నీల్ బార్ట్మన్ తలో వికెట్ పడగొట్టారు.
ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ తొలి మూడు మ్యాచ్లు ఓడి.. తర్వాతి మూడు మ్యాచ్ల్లో గెలిచింది. దాంతో పాయింట్స్ టేబుల్లో మూడో స్థానానికి చేరింది.
సౌతాఫ్రికా 20 లీగ్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు భాగమైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు తలపడుతుండగా.. ఈ ఆరు టీమ్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందినవే. సన్రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్తో పాటు రాజస్థాన్ రాయల్స్కు సంబంధించిన జట్లు ఉన్నాయి.
ఈ క్రమంలోనే సౌతాఫ్రికా 20 లీగ్ను మినీ ఐపీఎల్లా పరిగణిస్తారు. ఇక ప్రతీ మ్యాచ్కు హాజరయ్యే కావ్య మారన్.. ఈ సారి మాత్రం ఇంకా సౌతాఫ్రికా 20 లీగ్లో కనిపించలేదు.