సౌతాఫ్రికా టీ20 లీగ్లో ముంబై ఇండియన్స్కు చెందిన ఎంఐ కేప్టౌన్ పోరాటం ముగిసింది. ప్లే ఆఫ్స్ చేరకుండానే ముంబై జట్టు ఈ సీజన్ను ముగించింది. ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబై 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
కెప్టెన్ కీరన్ పొలార్డ్(16 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 33) మెరుపులు మెరిపించినా.. రాసీ వాన్ డెర్ డస్సెన్(46 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 60) హాఫ్ సెంచరీతో సత్తా చాటినా విజయాన్ని అందుకోలేకపోయింది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్లలో వేన్ పార్నెల్(4/33) నాలుగు వికెట్లు తీయగా.. ఎథన్ బోచ్, ఆదిల్ రషీద్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసి గెలుపొందింది. డీ బ్రూయిన్(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 42), సీనరన్ ముత్తుసామి(18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 38 నాటౌట్) రాణించారు.
ముంబై బౌలర్లలో జార్జ్ లిండే(2/36) రెండు వికెట్లు తీయగా.. నువాన్ తుషారా, సామ్ కరణ్, కగిసో రబడా, లియామ్ లివింగ్స్టోన్ తలో వికెట్ తీసారు.
ఈ ఓటమితో ఎంఐ కేప్టౌన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. మొత్తం 10 మ్యాచ్ల్లో 3 విజయాలు మాత్రమే నమోదు చేసింది. దాంతో పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానంలో నిలిచింది. ఇప్పటికే డర్బన్ సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ ఈస్టెర్న్ కేప్, పార్ల్ రాయల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకున్నాయి. తాజా పరాజయంతో ముంబై తప్పుకోవడంతో... నాలుగో స్థానం కోసం ప్రిటోరియా క్యాపిటల్స్, జోహన్నెస్బర్గ్ సూపర్ కింగ్స్ పోటీ పడుతున్నాయి.