
సెంచూరియన్: సన్రైజర్స్ హైదరాబాద్ సారథ్య బాధ్యతలు దక్కాయనే సంతోషమో? లేక సౌతాఫ్రికా టీ20 లీగ్ గెలిచిన ఉత్సాహమో! తెలియదు కానీ ఎయిడెన్ మార్క్రమ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. సొంతగడ్డపై వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో సెంచరీతో చెలరేగాడు. 174 బంతుల్లో 18 ఫోర్లతో 115 పరుగులు చేశాడు. దాంతో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 8 వికెట్లకు 314 పరుగులు చేసింది. మార్క్రమ్కు తోడుగా డీన్ ఎల్గర్(118 బంతుల్లో 11 ఫోర్లతో 71) రాణించాడు.
తొలి వికెట్కు మార్క్రమ్, ఎల్గర్ కలిసి 141 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. టోనీ డీ జోర్జీ(28)తో రెండో వికెట్కు 70 పరుగులు జోడించిన మార్క్రమ్..అల్జారీ జోసెఫ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో సఫారీ వికెట్ల పతనం మొదలైంది. కెప్టెన్ టెంబా బవుమా(0) సిల్వర్ డక్గా వెనుదిరగ్గా.. కీగన్ పీటర్సన్(14), హెన్రీచ్ క్లాసెన్(20) దారుణంగా విఫలమయ్యారు. క్రీజులో మార్కో జాన్సెన్(17 బ్యాటింగ్), గెరాల్డ్ కోయిట్జీ(11 బ్యాటింగ్) ఉన్నారు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ మూడు వికెట్లు తీయగా.. హోల్డర్, కేమర్ రోచ్, కైల్ మేయర్స్, షాన్నన్ గాబ్రియల్ తలో వికెట్ తీసారు.
మార్క్రమ్ సెంచరీ చేయడంపై సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జోరును ఐపీఎల్లో కొనసాగిస్తే ఆరెంజ్ ఆర్మీకి తిరుగుండదని కామెంట్ చేస్తున్నారు. ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ నూతన కెప్టెన్గా మార్క్రమ్ను ఫ్రాంచైజీ ప్రకటించిన విషయం తెలిసిందే. గత సీజన్కు ముందే డేవిడ్ వార్నర్ను వదులుకొన్న సన్రైజర్స్.. ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు కేన్ విలియమ్సన్ను వదిలేసింది. సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ను చాంపియన్గా నిలబెట్టిన మార్క్రమ్కు ప్రమోషన్ ఇస్తూ.. సన్రైజర్స్ బాధ్యతలను అప్పగించింది. సౌతాఫ్రికా టీ20 లీగ్లో మార్క్రమ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టును ఫైనల్కు చేర్చి తొలి టైటిల్ను అందించాడు.
అదే జోరును ఐపీఎల్లో కొనసాగించి చాంపియన్గా నిలబెడతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇప్పటికే మార్క్రమ్కు అండగా సోషల్ మీడియా వేదికగా క్యాంపైన్ షురూ చేశారు. మార్క్రమ్ మామా అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.