సొంతగడ్డపై పాకిస్థాన్తో జరుగుతున్న రెండు టెస్ట్ల సిరీస్లో సౌతాఫ్రికా ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి టెస్ట్ గెలిచి 1-0తో సిరీస్ ఆధిక్యంలో నిలిచిన సౌతాఫ్రికా.. రెండో టెస్ట్లోనూ భారీ స్కోర్ చేసింది. శుక్రవారం కేప్టౌన్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 80 ఓవర్లలో 4 వికెట్లకు 316 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(232 బంతుల్లో 21 ఫోర్లు, సిక్స్తో 176 బ్యాటింగ్) అజేయ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ టెంబా బవుమా(179 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 106) సెంచరీతో రాణించాడు. క్రీజులో ర్యాన్ రికెల్టన్తో పాటు డేవిడ్ బెడింగ్హమ్(4 బ్యాటింగ్) ఉన్నాడు.

పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ అఘా రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ అబ్బాస్, ఖుర్రామ్ షెహ్జాద్ తలో వికెట్ తీసారు. టెంబా బవుమా-ర్యాన్ రికెల్టన్ నాలుగో వికెట్కు 235 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు.
తొలి టెస్ట్ విజయంతో డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ బెర్త్ను దక్కించుకున్న సౌతాఫ్రికా.. అదే జోరులో మరో విజయంపై కన్నేసింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్(17), వియాన్ మల్డర్(5), ట్రిస్టన్ స్టబ్స్(0) విఫలమైనా.. టెంబా బవుమా, ర్యాన్ సూపర్ బ్యాటింగ్తో భారీ స్కోర్ నమోదు చేసింది. హోరాహోరీగా సాగిన తొలి టెస్ట్లో సౌతాఫ్రికా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి టెస్ట్ ఆడిన నసీమ్ షా.. రెండో టెస్ట్కు దూరమయ్యాడు.