అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన న్యూజిలాండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్కు దూసుకెళ్లింది. బుధవారం లాహోర్ వేదికగా ఏకపక్షంగా సాగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. బ్యాటింగ్లో కేన్ మామ, రచిన్ రవీంద్ర సెంచరీలతో చెలరేగితే.. బౌలింగ్లో మిచెల్ సాంట్నర్ తీన్మార్ బౌలింగ్తో సఫారీ పతనాన్ని శాసించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. రచిన్ రవీంద్ర(101 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్తో 108), కేన్ విలియమ్సన్(94 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 102) శతకాలతో రాణించారు. డారిల్ మిచెల్(37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 49) , గ్లేన్ ఫిలిప్స్ (18 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 49 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(3/72) మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడా(2/70) రెండు వికెట్లు పడగొట్టాడు. వియాన్ మల్డర్(1/48)కు ఓ వికెట్ దక్కింది.

ఒత్తిడికి చిత్తు
అనంతరం సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ టెంబా బవుమా(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 56), రాసీ వాన్ డెర్ డస్సెన్(66 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 69) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో డేవిడ్ మిల్లర్(67 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో ఒంటరి పోరాటం చేశాడు. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో సఫారీ బ్యాటర్లు ఒత్తిడికి చిత్తయ్యారు.
న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(3/43) మూడు వికెట్లు తీయగా.. గ్లేన్ ఫిలిప్స్(2/27), మ్యాట్ హెన్రీ(2/43) రెండేసి వికెట్లు పడగొట్టారు. మైకేల్ బ్రేస్వెల్(1/53), రచిన్ రవీంద్ర తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో టీమిండియాతో న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనుంది.
దెబ్బతీసిన సాంట్నర్..
భారీ లక్ష్యచేధనలో సౌతాఫ్రికాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఆదిలోనే ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(17)ను మ్యాట్ హెన్రీ పెవిలియన్ చేర్చాడు. దాంతో బ్యాటింగ్కు వచ్చిన రాసీ వాన్ డెర్ డస్సెన్తో టెంబా బవుమా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ భారీ షాట్లతో వేగంగా పరుగులు చేశారు. 64 బంతుల్లో బవుమా.. 51 బంతుల్లో వాన్ డెర్ డస్సెన్ హాఫ్ సెంచరీలు సాధించారు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని సాంట్నర్ విడదీసాడు. బవుమాను క్యాచ్ ఔట్ చేసి రెండో వికెట్కు నమోదైన 105 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ కాసేపటికే వాన్ డెర్ డస్సెన్ను క్లీన్ బౌల్డ్ చేసిన సాంట్నర్.. డేంజరస్ బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్(3)ను కూడా పెవిలియన్ చేర్చి సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు.
సెంచరీతో మిల్లర్ పోరాడినా..
ఎయిడెన్ మార్క్రమ్(31) కాసేపు పోరాడినా.. రచిన్ రవీంద్ర రిటర్న్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. దాంతో సఫారీ ఓటమి ఖాయమైంది. వియాన్ మల్డర్(8), మార్కో జాన్సెన్(3), కేశవ్ మహరాజ్(1), కగిసో రబడా(16) వరుసగా ఔటవ్వగా.. మరో ఎండ్లో డెవిడ్ మిల్లర్ ఒంటరి పోరాటం చేశాడు. కానీ చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండటంతో సౌతాఫ్రికా ఓటమి ఖాయమైంది. అయినా మిల్లర్ ఆఖరి వరకు క్రీజులో ఉండి శతకం పూర్తి చేసుకున్నాడు.