SA vs IND: టీమిండియా తాత్కలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత తక్కువ బంతుల్లో 2000 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ కేవలం 1163 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ఈ ఘనతను అందుకున్నాడు.
ఈ మ్యాచ్లో విలియమ్స్ వేసిన ఐదో ఓవర్ నాలుగో బంతిని సింగిల్ తీసిన సూర్య.. టీ20ల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 56 ఇన్నింగ్స్ల్లోనే అతను ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ టాప్లో ఉన్నాడు. అతను 52 ఇన్నింగ్స్ల్లో 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అతని తర్వాత మహమ్మద్ రిజ్వాన్(52) సూర్యకుమార్ యాదవ్ కన్నా ముందున్నారు. కేఎల్ రాహుల్(58)ను సూర్య వెనక్కినెట్టాడు.

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. 107 ఇన్నింగ్స్ల్లో 4008 రన్స్తో కోహ్లీ టాప్లో ఉండగా.. 140 ఇన్నింగ్స్ల్లో రోహిత్ 3853, 68 ఇన్నింగ్స్ల్లో రాహుల్ 2256.. సూర్యకుమార్ యాదవ్ కన్నా ముందున్నారు.
ఈ మ్యాచ్లో 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్.. సౌతాఫ్రికాపై నాలుగో ఫిఫ్టీని ఖాతాలో వేసుకున్నాడు. సౌతాఫ్రికాతో ఐదు టీ20 ఇన్నింగ్స్ల్లో నాలుగుసార్లు హాఫ్ సెంచరీ చేయడం విశేషం.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్ డకౌట్లు పెవిలియన్ చేరారు. దాంతో టీమిండియా 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యతో కలిసి తిలక్ వర్మ ధాటిగా ఆడాడు.
20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 29 పరుగులు చేసి వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. వికెట్లు పడినా ధాటిగా ఆడిన సూర్య హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడుతున్న అతన్ని షంసీ పెవిలియన్ చేర్చాడు.