సౌతాఫ్రికా పర్యటనకు భారత బ్యాటర్లు ఘనంగా ప్రారంభించారు. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. నాలుగు టీ20ల సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో సంజూ శాంసన్((50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్లతో 107) శతకంతో చెలరేగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోర్ చేసింది.
సంజూ శాంసన్తో పాటు తిలక్ వర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 33) దూకుడుగా ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ(3/37) మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రుగర్ తలో వికెట్ తీసారు.

అనంతరం సంజూ శాంసన్ అదే జోరును కొనసాగించాడు. సూర్య కాస్త నెమ్మదిగా ఆడినా సంజూ వేగంగా పరుగులు రాబట్టాడు. పీటర్ వేసిన 8వ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాది 27 బంతుల్లోనే సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ప్యాట్రిక్ క్రుగర్ వేసిన మరుసటి ఓవర్లో సూర్య క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
47 బంతుల్లోనే శతకం..
క్రీజులోకి తిలక్ వర్మ రాగా.. సంజూ శాంసన్ అదే దూకుడు కనబర్చాడు. భారీ సిక్స్లతో విరుచుకుపడ్డాడు. కేశవ్ మహరాజా వేసిన 15వ ఓవర్ తొలి బంతిని క్విక్ సింగిల్ తీసి 47 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్లో తిలక్ వర్మ(33) క్యాచ్ ఔటవ్వడంతో మూడో వికెట్కు నమోదైన 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పీటర్ వేసిన తర్వాతి ఓవర్లో భారీ సిక్సర్ బాదిన సంజూ శాంసన్.. మరసటి బంతికే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా(2), రింకూ సింగ్(11), అక్షర్ పటేల్(7), రవి బిష్ణోయ్(1) నిరాశపరిచినా.. అర్ష్దీప్ సింగ్(5) భారత జట్టు స్కోర్ను 200 ధాటించాడు.