SA vs IND: సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు వరణుడు ఊహించని షాకిచ్చాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో కటాఫ్ టైమ్ వరకు వేచి చూసిన అంపైర్లు.. మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాదని భావించి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
భారతీయులు అత్యధికంగా నివసించే డర్బన్లో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎగబడ్డారు. దాదాపు టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దవ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అభిమానులతో పాటు ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూసిన ఇరు జట్ల ఆటగాళ్లు నిరాశగా వెనుదిరిగారు.

వచ్చే ఏడాదే జరగనున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్ చాలా కీలకం. టీమ్ కాంబినేషన్ సెట్ చేసుకునేందుకు ఈ సిరీస్ను వాడుకోవాలని ఇరు జట్లు భావించాయి. మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్ఫార్పణం కావడంతో తమ ప్రణాళికలకు ఎదురుదెబ్బ తగిలింది.
ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 మంగళవారం జీక్యూబెర్హా వేదికగా జరగనుంది. ప్రపంచకప్ ఓటమి అనంతరం సూర్యకుమార్ కెప్టెన్సీలో టీమిండియా యువ జట్టు ఆస్ట్రేలియాను 4-1 తేడాతో చిత్తుగా ఓడించింది. ఇప్పుడు సౌతాఫ్రికా టీ20 సిరీస్ ను కైవసం చేసుకోవాలని సూర్యసేన పట్టుదలతో ఉంది. అంతేగాక సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ చేరడం జట్టుకు మరింత బలాన్ని ఇస్తుంది.
ఇక సౌతాఫ్రికాతో జరిగిన గత నాలుగు టీ20 సిరీస్ లో టీమిండియా రెండు సార్లు విజేతగా నిలిచింది. మరో రెండు సిరీస్ లు డ్రాగా ముగిశాయి. 2015లో జరిగిన టీ20 సిరీస్ విజయమే టీమిండియాపై దక్షిణాఫ్రికాకు ఆఖరిది. ఆ తర్వాత భారత్ దే పైచేయి. వాస్తవానికి తొలి టీ20కి వర్షం ముప్పు పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ ముందే చెప్పింది.
భారత్తో జరిగే సిరీస్లతో ఆర్థికంగా బలపడాలని భావించిన సౌతాఫ్రికాకు తొలి మ్యాచ్ రద్దవ్వడం తీరని నష్టాన్ని మిగల్చనుంది.