SA vs IND: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్పై అభిమానులు మండిపడుతున్నారు. అనవసర ప్రయోగాలతో ఆటగాళ్లకు అన్యాయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో ఇషాన్ కిషన్కు తుది జట్టులో చోటు దక్కలేదు. వికెట్ కీపర్గా జితేశ్ శర్మకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇషాన్ కిషన్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది.
టాపార్డర్లో ఆడే అవకాశం లేకపోవడంతో లోయరార్డర్లో ఆడే జితేశ్ శర్మను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో చివరి రెండు టీ20ల్లో అవకాశం అందుకున్న జితేశ్ శర్మ అద్భుతంగా రాణించాడు. తొలి మూడు మ్యాచ్లు ఆడిన ఇషాన్ కిషన్ కూడా తనదైన బ్యాటింగ్తో చెలరేగాడు.

అయితే జితేశ్ శర్మకు బదులు ఇషాన్ కిషన్నే కొనసాగించాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జితేశ్ శర్మ కంటే ఎక్కువ అనుభవం ఉన్న ఇషాన్ కిషన్కే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. 'డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్కు మళ్లీ నిరాశే. నిలకడైన ప్రదర్శన చేస్తున్నా.. అవకాశం ఇవ్వకపోతే ఎలా? అలాంటప్పుడు అతన్ని జట్టుకు ఎందుకు ఎంపిక చేస్తున్నారు?'అని ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు.
ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా సైతం ఇషాన్ కిషన్ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టాడు. 'తుది జట్టులో ఇషాన్ కిషన్ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. మన జట్టు ఇంకా ప్రయోగాలు చేయాలనుకుంటుందా? జితేశ్ శర్మ, ఇషాన్ కిషన్లో వికెట్ కీపర్ ఎవరా? అనేది తేల్చుకోలేకపోతుందా? లేకుంటే విరాట్, రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ ఆడనుండటంతో నెంబర్ 5, నెంబర్ 6లో ఆడగలిగే వికెట్ కీపర్ కోసం ఎదురు చూస్తుందా?'అని ప్రశ్నల జల్లు కురిపించాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్ డకౌట్లు పెవిలియన్ చేరారు. మార్కో జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే యశస్వీ జైస్వాల్ 3 బాల్ డక్గా వెనుదిరగ్గా.. లిజాడ్ విలియమ్స్ వేసిన రెండో ఓవర్లో శుభ్మన్ గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో టీమిండియా 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, సూర్య ధాటిగా ఆడుతున్నారు.