సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా తాత్కలిక టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో గురువారం జరిగిన ఆఖరి మ్యాచ్లో సూర్య ఫీల్డింగ్ చేస్తుండగా.. అతని ఎడమ చీలమండకు గాయమైంది.
బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపి త్రో విసిరే సమయంలో సూర్య లెఫ్ట్ యాంకిల్ ట్విస్ట్ అయ్యింది.
దాంతో సూర్య మైదానంలోనే కుప్పకూలాడు. తీవ్ర నొప్పితో విలవిలలాడాడు. వెంటనే టీమిండియా ఫిజియోలు పరుగెత్తుకొచ్చి అతన్ని పరీక్షించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో భుజాలపై ఎత్తుకొని డ్రెస్సింగ్ రూమ్కు తీసుకెళ్లారు. నొప్పితో ఇబ్బంది పడిన సూర్య కనీసం కాలును కింద కూడా పెట్టలేకపోయాడు.

అతన్ని స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. ఈ స్కానింగ్ రిపోర్ట్లపైనే సూర్య భవితవ్యం ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ స్కానింగ్ రిపోర్ట్స్లో అతని చీలమండలో చిన్న చీలిక వచ్చినా అతను సుదీర్ఘ కాలంపాటు జట్టుకు దూరం కావాల్సి వస్తోంది. చీలమండ గాయం తగ్గినా.. మళ్లీ మళ్లీ వెంటాడుతోంది.
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ ముంగిట సూర్య గాయపడటం అభిమానులను కలవరపెడుతోంది. అతని గాయం సాధారణమే అయితే ఎలాంటి సమస్య లేదు. సూర్యకుమార్ యాదవ్ తాజా గాయం ముంబై ఇండియన్స్ అభిమానులను సైతం కలవరపెడుతోంది. సూర్య గాయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. సూర్య మైదానం వీడటంతో రవీంద్ర జడేజా తాత్కలిక సారథిగా జట్టును నడిపించాడు.
అయితే మైదానం వీడేటప్పుడు చాలా అసౌకర్యంగా కనిపించిన సూర్య.. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సమయంలో సాధారణంగా కనిపించాడు. గాయం నొప్పి పెద్దగా లేదని, బాగానే ఉన్నానని చెప్పాడు.
ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ (56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లతో 100) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా నాలుగు శతకాలు బాదిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్, లిజాడ్ విలియమ్స్ రెండేసి వికెట్లు తీయగా.. నాండ్రె బర్గర్, టబ్రైజ్ షంసీ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. కుల్దీప్ యాదవ్(5/17) ధాటికి 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ మిల్లర్(35), ఎయిడెన్ మార్క్రమ్(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్కు తోడుగా రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, అర్ష్దీప్ సింగ్ తలో వికెట్ తీసారు.