సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్ట్లో తొలి రోజే 23 వికెట్లు పడ్డాయి. పేస్ బౌలింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై బౌలర్లు నిప్పులు చెరగడంతో బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. 95 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 62 పరుగులు చేసింది.
క్రీజులో ఎయిడెన్ మార్క్రమ్(36 బ్యాటింగ్)తో పాటు డేవిడ్ బెడ్డింగ్హమ్(7 బ్యాటింగ్) ఉన్నారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్(2/25) రెండు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా(1/25) ఒక వికెట్ పడగొట్టాడు. సౌతాఫ్రికా ఇంకా 36 పరుగుల వెనుకంజలో ఉంది. సౌతాఫ్రికా తాత్కలిక కెప్టెన్ డీన్ ఎల్గర్(12) తన చివరి ఇన్నింగ్స్ ఆడేసాడు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న అతను ఆఖరి టెస్ట్లో ఒకే రోజు రెండుసార్లు బ్యాటింగ్ చేసి ఔటయ్యాడు.

తొలి ఇన్నింగ్స్లో 4 పరుగులు చేసిన డీన్ ఎల్గర్.. రెండో ఇన్నింగ్స్లో 12 పరుగులే చేశాడు. కెరీర్ ముగించిన డీన్ ఎల్గర్కు విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు అభినందనలు తెలిపారు. డీన్ ఎల్గర్ ఔటైన వెంటనే అతని దగ్గరకు వచ్చి హగ్ చేసుకోవడంతో పాటు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని అభిమానులకు కోహ్లీ సూచించాడు. ప్రేక్షకులు, ఆటగాళ్ల కరతాళ ధ్వనుల మధ్య డీన్ ఎల్గర్.. మైదానం వీడాడు.
55 ఆలౌట్..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్(6/15) ఆరు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించగా... జస్ప్రీత్ బుమ్రా(2/25), ముఖేష్ కుమార్(2/0) రెండేసి వికెట్లతో రాణించారు.
సఫారీ బ్యాటర్లలో డేవిడ్ బెడింగ్హమ్(12), కైల్ వెర్రెయన్(15) మాత్రమే రెండెంకల స్కోర్ చేశారు. ఫస్ట్ సెషన్లోనే సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్ నమోదు చేసింది.
11 బంతులు.. 6 వికెట్లు
అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు కుప్పకూలింది. ఓ దశలో 153/4 స్కోర్తో పటిష్టంగా కనిపించిన టీమిండియా.. అనంతరం 11 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయింది. చివరి ఆరుగురు బ్యాటర్లలో ఐదుగురు కనీసం ఖాతా తెరవలేకపోయారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇలా ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.
ఈ చెత్త ఫీట్ సాధించిన జట్టుగా టీమిండియా అప్రతిష్టను మూటగట్టుకుంది. భారత జట్టులో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 46), శుభ్మన్ గిల్(55 బంతుల్లో 5 ఫోర్లతో 36), రోహిత్ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లతో 39)మాత్రమే రాణించారు. సఫారీ బౌలర్లలో కగిసో రబడా(3/38), లుంగి ఎంగిడి(3/30), నండ్రే బర్గర్(3/42) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.