బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో శనివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ ఓటమితో ఒక్క విజయం సాధించకుండానే ఈ టోర్నీ నుంచి ఇంగ్లండ్ నిష్క్రమించింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ చేతిలో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. తాజా మ్యాచ్లోనూ పేలవ ప్రదర్శనతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని పాయింట్స్ టేబుల్లో ఆఖరి స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన జోస్ బట్లర్ ఈ పరాజయం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. 'ఈ మ్యాచ్లో మా ప్రదర్శన తీవ్రంగా నిరాశపర్చింది. ఈ రోజు మేం దారుణంగా విఫలమయ్యాం. అది మరింత బాధను కలిగించింది. పిచ్ బాగుంది. కాస్త టూపేస్గా ఉంది. బెన్ డకెట్ దూకుడుగా ఆడి శుభారంభం అందించాడు. కానీ మేం ఆ ఆరంభాన్ని ఉపయోగించుకోలేకపోయాం. నిజాయితీగా చెప్పాలంటే ఈ టోర్నీలో మేం ఎందుకు విఫలమయ్యామో నాకు తెలియదు.

విజయాలు సాధించడంలో మేం సమష్టిగా విఫలమయ్యాం. దాంతో మా ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ఈ పరిస్థితి మారుతుందనుకుంటున్నా. క్రికెట్ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి. వాస్తవానికి జట్టులో ప్రతిభకు లోటు లేదు. జట్టులో అన్ని అంశాలు ఉన్నాయి. ఈ పరాజయాల నేపథ్యంలో బ్రెండన్తో పాటు టాప్లో ఉన్న వ్యక్తులు కొన్ని ప్రణాళికలు రూపొందిస్తారని భావిస్తున్నాను. నా కెప్టెన్సీలో ప్రపంచకప్ గెలవడం అత్యుత్తమమైన సందర్భం.
జో రూట్ ఓ వెలుగుతున్న లైట్ వంటి వాడు. అతను మాకు గొప్ప ఉదాహరణ. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా అతను అద్భుతంగా ఆడుతున్నాడు. నేను అతన్ని అనుసరిస్తానని ఆశిస్తున్నాను.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు. వరుస పరాజయాల నేపథ్యంలో జోస్ బట్లర్ ఇంగ్లండ్ వైట్బాల్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. వన్డేల్లో ఇంగ్లండ్ వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడింది. టీమిండియా చేతిలో మూడు వన్డేల సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన ఇంగ్లండ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు మ్యాచ్లకు మూడు ఓడింది.