పార్ల్: సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్లో పర్యాటక ఇంగ్లండ్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకొని ఆతిథ్య జట్టుకు షాక్ ఇచ్చింది. ఆదివారం జరిగిన రెండో టీ20లో మలాన్(40 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 55) సూపర్ ఫిఫ్టీతో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 రన్స్ చేసింది. కెప్టెన్ క్వింటన్ డికాక్ (30), జార్జ్ లిండే (29) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్ తలో వికెట్ తీయగా.. ఆదిల్ రషీద్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం ఇంగ్లండ్.. మలాన్ (55) అర్ధ సెంచరీతో మెరవడంతో 19.5 ఓవర్లలో 147/6 స్కోరు చేసి మరో బంతి మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ మోర్గాన్ 26 (నాటౌట్), జోస్ బట్లర్ 22 రన్స్ చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో టబ్రైజ్ షంసీ మూడు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి రెండు వికెట్లు, రబడా ఒక వికెట్ తీశాడు.