డర్బన్: సౌతాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో మూడు టీ20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి టీ20లో సమష్టిగా రాణించిన ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్లలో రిజా హెండ్రిక్స్(30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 42), డొనోవన్ ఫెర్రెయిరా(21 బంతుల్లో ఫోర్, 5 సిక్స్లతో 48), ఎయిడెన్ మార్క్రమ్(23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 41) రాణించారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో సీన్ అబాట్(4/31) నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్కస్ స్టోయినీస్(2/39) రెండు వికెట్లు తీసాడు. తన్వీర్ సంఘాకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 91) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. జోష్ ఇంగ్లీస్(22 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 42), మార్కస్ స్టోయినీస్(21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 37 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
సఫారీ బౌలర్లలో గెరాల్డ్ కొయిట్జీ(2/36), ఫర్చూన్(2/36) రెండేసి వికెట్లు తీయగా.. మార్క్రమ్ ఓ వికెట్ పడగొట్టాడు. చెత్త ఫీల్డింగ్ సౌతాఫ్రికా కొంపముంచింది. నాలుగు క్యాచ్లను నేలపాలు చేసిన ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. 186 పరుగులతో సిరీస్లో సత్తా చాటిన మిచెల్ మార్ష్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.
సెప్టెంబర్ 7 నుంచి ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. సౌతాఫ్రికా పర్యటనకు గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమైన ఆసీస్ అసాధారణ ప్రదర్శన టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఇదే జోరులో వన్డే సిరీస్ గెలిచి వన్డే ప్రపంచకప్ కోసం రెట్టించిన ఉత్సాహంతో భారత్కు రావాలనుకుంటోంది. ప్రపంచకప్ ముందు భారత్-ఆసీస్ మధ్య వన్డే సిరీస్ జరగనుంది.