సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను ఉద్దేశించి టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా శుక్రవారం కోల్కతా వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే బవుమా బ్యాటింగ్ చేసే సమయంలో బుమ్రా వేసిన బంతి అతని ప్యాడ్లకు తాకింది. దాంతో భారత ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా.. అంపైర్ తిరస్కరించాడు. దాంతో రివ్యూ తీసుకునే విషయంపై బుమ్రా.. వికెట్ కీపర్ రిషభ్ పంత్తో చర్చించాడు.
ఈ క్రమంలో బవుమా మరుగుజ్జు కదా? అని హిందీలో బౌనా బీ హై అన్నాడు. అందుకు పంత్ కూడా బవుమా పొట్టోడే అయినప్పటికీ బంతి వికెట్ల కంటే ఎత్తులో వెళ్తుందని బదులిచ్చాడు. దాంతో రివ్యూ తీసుకోలేదు. రిప్లేలో బంతి వికెట్ల కంటే ఎత్తులో వెళ్లినట్లు తేలింది. అయితే పంత్, బుమ్రా మధ్య జరిగిన సంభాషణ స్టంప్ మైక్లో రికార్డ్ అవ్వడంతో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. బవుమా పొట్టోడంటూ వివక్ష వ్యాఖ్యలు చేశారని సౌతాఫ్రికా ఫ్యాన్స్ బుమ్రా, పంత్లపై విమర్శలు గుప్పించారు.

బౌనా బీ హై అంటే హిందీలో మరుగుజ్జు అని అర్థం. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఆఖరి బంతికి ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే తప్పుడు ఉద్దేశంతో భారత ఆటగాళ్లు ఈ వ్యాఖ్యలు చేయలేదని అర్థమవుతుంది. అది తొడకి తగిలింది కదా అని పంత్ అంటుంటే.. పొట్టోడే కదా తొడకి తగిలినా వికెట్లకే బంతి దూసుకెళ్లుంటుంది అన్న సెన్స్లో బుమ్రా ఈ అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు.
అయితే ఈ విషయాన్ని తాము వివాదంగా చూడటం లేదని సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ అష్వెల్ ప్రిన్స్ తెలిపాడు. 'ఇది నా దృష్టికి వచ్చింది. మేం ఎవరం కూడా ఈ ఘటనపై చర్చ చేయలేదు. మైదానంలో ఏం జరిగిందన్న దాంతో పెద్ద సమస్యేమి లేదు.' అని తొలి రోజు ఆట అనంతరం అష్వెల్ ప్రిన్స్ చెప్పుకొచ్చాడు. గాయం నుంచి కోలుకోని ఈ మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చిన బవుమా(3) తొలి ఇన్నింగ్స్లో తీవ్రంగా నిరాశపర్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ఎయిడెన్ మార్క్రమ్(48 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 31), వియాన్ మల్డర్(51 బంతుల్లో 3 ఫోర్లతో 24), ర్యాన్ రికెల్టన్(22 బంతుల్లో 4 ఫోర్లతో 23), టోనీ డీ జోర్జి(55 బంతుల్లో ఫోర్, సిక్స్తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(5/27) ఐదు వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించాడు. మహమ్మద్ సిరాజ్(2/47), కుల్దీప్ యాదవ్(2/36) రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 109 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో జడేజాతో పాటు పంత్ ఉన్నాడు.