
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ బద్రీనాథ్ కూడా కరోనా వైరస్ బారినపడ్డాడు. రాయ్పూర్ వేదికగా ఇటీవల ముగిసిన రోడ్ సేప్టీ వరల్డ్ టీ20 సిరీస్లో సచిన్ టెండూల్కర్, యూసఫ్ పఠాన్లతో కలిసి ఇండియా లెజెండ్స్ జట్టుకు ఆడిన బద్రీనాథ్.. తనకి కరోనా సోకినట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. శ్రీలంక లెజెండ్స్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లోనూ బద్రీనాథ్ ఆడాడు. టోర్నీ విజేతగా ఇండియా లెజెండ్స్ టీమ్ నిలిచిన తర్వాత సచిన్ టెండూల్కర్తో కలిసి బద్రీనాథ్ సెల్ఫీ కూడా తీసుకున్నాడు.
ఇండియా లెజెండ్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ వహించగా.. అతనితో పాటు ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ కూడా ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా బద్రీనాథ్కు కూడా కరోనా సోకవడంతో.. ఇండియా లెజెండ్స్ టీమ్లో ఆడి.. ఈ వైరస్ బారిన పడిన మూడో క్రికెటర్గా అతను నిలిచాడు. టోర్నీ ఫైనల్ మ్యాచ్కు కూడా స్టేడియంలోకి ప్రేక్షకుల్ని నిర్వాహకులు అనుమతించారు.
రోడ్ సేప్టీ వరల్డ్ టీ20 సిరీస్లో మూడు మ్యాచ్లాడిన బద్రీనాథ్ 57 పరుగులు చేశాడు. కరోనా వైరస్ సోకడంతో ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నట్లు వెల్లడించిన బద్రీనాథ్.. జాగ్రత్తలు తీసుకున్నా తాను వైరస్ బారినపడినట్లు చెప్పుకొచ్చాడు. ఇండియా లెజెండ్స్ టీమ్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ తదితరులు కూడా ఆడారు. బద్రీనాథ్కు పాజిటివ్ రావడంతో ఇండియా లెజెండ్స్ తరఫున ఆడిన క్రికెటర్లలో కంగారు మొదలైంది. వారంతా టెస్ట్లు చేసుకునేందుకు రెడీ అయ్యారు.