ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఆ జట్టు ఏకంగా ఐదు టైటిళ్లు గెలిచింది. దాంతో ధోనీ ఆ జట్టుకు ఐకానిక్ ప్లేయర్గా మారాడు. ధోనీ లేని చెన్నై సూపర్ కింగ్స్ను ఊహించడమే కష్టంగా మారింది. తమిళనాడు అభిమానులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్.. సీఎస్కే జట్టును అభిమానిస్తున్నారంటే దానికి కారణం ధోనీ.
అలాంటి ధోనీని ముందుగా సీఎస్కే తీసుకోవాలనుకోలేదట. ఐపీఎల్ అరంగేట్ర వేలంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను కొనుగోలు చేయాలని సీఎస్కే భావించిందట. ఈ విషయాన్ని తమిళనాడుకు చెందిన టీమిండియా మాజీ క్రికెటర్ ఎస్ బద్రీనాథ్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

'ఐపీఎల్ అరంగేట్ర వేలంలో సీఎస్కే ధోనీని కాకుండా వీరేంద్ర సెహ్వాగ్ను తీసుకోవాలనుకుంది. అయితే అప్పటికే సెహ్వాగ్ను.. ఢిల్లీ డేర్డెవిల్స్(ఇప్పటి ఢిల్లీ క్యాపిటల్స్) తీసుకుంది. దాంతో ధోనీని తీసుకునేందుకు సీఎస్కేకు మార్గం సుగుమమైంది. సీఎస్కే టీమ్ కూర్పులో భారత మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించాడు. సెహ్వాగ్పై మేనేజ్మెంట్ ఆసక్తికనబర్చినప్పటికీ ధోనీని తీసుకోవాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. ధోనీ సీఎస్కేలోకి రావడానికి అతనే ప్రధాన కారణం.'అని బద్రీనాథ్ చెప్పుకొచ్చారు.
43 ఏళ్ల ధోనీ.. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడుతాడా? లేదా? అనేది సందేహంగా మారింది. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో సీఎస్కే ధోనీని రిటైన్ చేసుకుంటుందా? వేలంలోకి వదిలేస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ధోనీ మాత్రం బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ వచ్చిన తర్వాతే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేశాడు.
మరోవైపు సీఎస్కే మాత్రం ధోనీని రిటైన్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఓ పాత రూల్ను మళ్లీ తీసుకురావాలని బీసీసీఐని కోరుతోంది. గతంలో ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన క్రికెటర్లను అన్క్యాప్డ్గా పరిగణించేవారు. ధోనీ కూడా అంతర్జాతీయ క్రికెట్కు దూరమై ఐదేళ్లు అవుతోంది. అతన్ని అనామక ప్లేయర్గా రిటైన్ చేసుకునేందుకు వెసులు బాటు ఇవ్వాలని సీఎస్కే.. బీసీసీఐని కోరినట్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు ధోనీ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలోనే ధోనీ ఉన్నట్లు కూడా కథనాలు వచ్చాయి.