సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరగనున్న రెండు టెస్ట్ల సిరీస్కు టీమిండియా సిద్దమవుతోంది.కోల్కతా వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2025-27 సైకిల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్లో విజయమే లక్ష్యంగా ఇరు జట్లు సన్నదమవుతున్నాయి. ఈ సిరీస్లో గెలిచిన జట్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మెరుగవనున్నాయి. దాంతో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన వైస్ కెప్టెప్ రిషభ్ పంత్ ఈ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దాంతో తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రిషభ్ పంత్ గౌర్హాజరీలో ధ్రువ్ జురెల్ మెరుగ్గా రాణించాడు. వెస్టిండీస్తో సెంచరీ చేయడంతో పాటు సౌతాఫ్రికా-ఏతో రెండో అనధికార టెస్ట్ల్లో రెండు శతకాలు నమోదు చేశాడు. ప్రస్తుతం ధ్రువ్ జురెల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. తుది జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్తో పాటు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇద్దరు వికెట్ కీపర్లతో బరిలోకి దిగితే తుది జట్టులో నుంచి ఎవర్ని తప్పించాలనేది చర్చనీయాంశంగా మారింది.

సాయి సుదర్శన్ను పక్కన పెట్టాలనే డిమాండ్ వ్యక్తమైంది. కానీ టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే మాత్రం నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ధ్రువ్ జురెల్ బరిలోకి దిగుతాడని హింట్ ఇచ్చాడు. తొలి టెస్ట్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన డస్కాటే.. నితీష్ కుమార్ రెడ్డి తొలి టెస్ట్ ఆడే అవకాశం లేదన్నాడు.
'నితీష్ కుమార్ రెడ్డి విషయంలో మా వైఖరి మారలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో అతనికి అవకాశం దక్కలేదు. కానీ సౌతాఫ్రికాతో సిరీస్ నేపథ్యంలో నెలకొన్న పోటీ కారణంగా అతనికి తుది జట్టులో ఆడే అవకాశం దక్కదని నేను భావిస్తున్నాను. బ్యాటింగ్ డెప్త్, స్పెషలిస్ట్ బౌలర్లతో జట్టును సమతూకంగా ఉంచుకోవడం కీలకం. కేవలం ఒక ఆల్రౌండర్ కోసం స్పెషలిస్ట్ ప్లేయర్ను పక్కనపెట్టాలని మేం అనుకోవడం లేదు.
ధ్రువ్ జురెల్ను తుది జట్టులో ఆడుతాడు. అతను సూపర్ ఫామ్లో ఉన్నాడు. ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్ ఇద్దరూ బరిలోకి దిగుతారు. ఈ ఇద్దరిలో ఒకరు లేకపోయినా నేను ఆశ్చర్యపోతాను.'అని ర్యాన్ టెన్ డస్కాటే చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ ఆడిన నితీష్ కుమార్ రెడ్డి పక్కటెముకల గాయంతో టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.