చెత్త ఫీల్డింగే మరోసారి తమ పతనాన్ని శాసించిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. గత నాలుగు మ్యాచ్ల్లో తమ ఫీల్డింగ్ స్థాయికి తగ్గట్లు లేదని అంగీకరించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ముల్లాన్పూర్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లో చెన్నైకి ఇది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం.
క్యాచ్లు వదిలేయడంతో..
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్.. మరోసారి ఫీల్డింగ్ వైఫల్యమే తమను దెబ్బతీసిందన్నాడు. 'గత నాలుగు మ్యాచ్ల్లోనూ ఫీల్డింగ్ వైఫల్యమే మమ్మల్ని దెబ్బతీసింది. మేం క్యాచ్లు వదిలేసిన బ్యాటర్లు 15, 20, 30 పరుగులు అదనంగా చేస్తున్నారు. గత నాలుగు మ్యాచ్ల్లో ఆర్సీబీతో మినహా మిగతా మూడింటిలోనూ ఒకటి, రెండు, మూడు హిట్స్కు దూరంగా విజయాన్ని చేజార్చుకున్నాం.

హై రిస్క్ బ్యాటింగ్..
ప్రియాన్ష్ ఆర్య ఆట తీరును మెచ్చుకోవాల్సిందే. అతను హై రిస్క్ బ్యాటింగ్తో చెలరేగాడు. మేం వరుస విరామాల్లో వికెట్లు తీసినా.. పంజాబ్ బ్యాటర్లు తమ దూకుడును కొనసాగించారు. ఓవర్కు 10-15 పరుగులు తక్కువ కాకుండా ఆడారు. ఈ రోజు మా బ్యాటింగ్ బాగుంది. మేం కోరుకున్నది కూడా ఇదే. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర మా బెస్ట్ బ్యాటర్లు. ఈ ఇద్దరూ పేస్ను అద్భుతంగా ఆడగలరు కాబట్టే వారిని ఓపెనర్లుగా ఆడిస్తున్నాం. మా బ్యాటింగ్ చాలా మెరుగైంది. చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ను మేం మూడు భారీ షాట్ల దూరంలో చేజార్చుకున్నాం.
అందుకే కాన్వే రిటైర్డ్ ఔట్..
కాన్వే అద్భుతంగా ఆడాడు. ఎక్కువసేపు క్రీజులో ఉన్నాడు. జడేజా ఫినిషర్ రోల్ పోషించగలడని కాన్వేను రిటైర్డ్ ఔట్గా వెనక్కి రప్పించాం. మా కుర్రాళ్లకు ఒక్కటే చెప్పాను. ఫీల్డింగ్ను ఆస్వాదించాలని సూచించాను. అలా కాకుండా మైదానంలో కంగారుగా ఉంటే క్యాచ్లు నేలపాలు అవుతాయని చెప్పాను. 'అత్యుత్తమ ఫీల్డర్గా క్యాచ్ అందుకున్నా.. బౌండరీ ఆపినా..జట్టుకు ఉపయోగపడుతోంది.'అని తెలిపాను. బ్యాటింగ్, బౌలింగ్లో బ్యాడ్ డే ఉంటుంది. కానీ ఫీల్డింగ్లో తప్పిదాలను సరిదిద్దుకోవాలి. మేం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. మా ఫీల్డింగ్ మెరుగవ్వడం లేదు.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.
ప్రియాన్ష్ ఆర్య సెంచరీ..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య(42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్లతో 103) సెంచరీతో చెలరేగగా.. శశాంక్ సింగ్(36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్(2/45), రవిచంద్రన్ అశ్విన్(2/48) రెండేసి వికెట్లు తీయగా.. ముఖేష్ చౌదరి, నూర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.
అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులే చేసి ఓటమిపాలైంది. డెవాన్ కాన్వే(49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 69) హాఫ్ సెంచరీతో రాణించగా.. శివమ్ దూబే(27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 42), రచిన్ రవీంద్ర(23 బంతుల్లో 6 ఫోర్లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్(2/40) రెండు వికెట్లు తీయగా.. గ్లేన్ మ్యాక్స్వెల్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.