చెత్త ఫీల్డింగ్ తమ ఓటమిని శాసించిందని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. కీలకమైన క్యాచ్లు పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా శుక్రవారం చెపాక్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) 50 పరుగుల తేడాతో సీఎస్కేను ఓడించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్.. కీలకమైన క్యాచ్లు నేల పాలు చేయడంతో పాటు బౌలింగ్లో అదనంగా 20 పరుగులివ్వడం విజయవకాశాలను దెబ్బ తీసిందన్నాడు. బ్యాటింగ్లోనూ పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయలేక మూల్యం చెల్లించుకున్నామని అభిప్రాయపడ్డాడు.

170 పరుగులే కష్టం..
'నిజాయితీగా చెప్పాలంటే ఈ వికెట్పై 170 పరుగులు చేధించడమే కష్టం. ఈ పిచ్ బ్యాటింగ్కు ఏ మాత్రం అనుకూలంగా లేదు. ఫీల్డింగ్లో ఈ రోజు మాకు బ్యాడ్ డే. చెత్త ఫీల్డింగే మా పతనాన్ని శాసించింది. 170 పరుగుల లక్ష్యాన్ని చేధించాలంటే విభిన్నంగా బ్యాటింగ్ చేయాలి. కాస్త టైమ్ కూడా తీసుకొని ఆడవచ్చు. కానీ 170 రన్స్కు అదనంగా 20 పరుగుల లక్ష్యాన్ని బ్యాటింగ్కు కఠినంగా ఉన్న వికెట్పై చేధించాలంటే మాత్రం పవర్ప్లేలోనే దూకుడుగా ఆడాలి. బంతి పాత బడితే బ్యాటింగ్కు మరింత కష్టమవుతుంది కాబట్టి కొత్తగా ఉన్నప్పుడే ఎదురుదాడికి దిగాలి. కానీ కొత్త బంతే ఐదు ఓవర్ల వరకు ఆగుతూ వచ్చింది. ఇది ఎలా జరిగిందో తెలియడం లేదు.
మా ప్లాన్ వర్కౌట్ కాలేదు..
రాహుల్ త్రిపాఠి, నేను మా షాట్స్ను నమ్ముకొని ఆడాం. కానీ షాట్స్ కొన్నిసార్లు వర్కౌట్ అయితే మరికొన్ని సార్లు అవ్వవు. చేయాల్సిన పరుగుల కంటే ఎక్కువ చేసినప్పుడు.. అదనంగా 20 పరుగులు చేధించాల్సినప్పుడు.. దూకుడుగానే ఆడాలి. మేం ఆ ప్రణాళికతోనే ఆడబోయాం. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఈ మ్యాచ్లో ఓడినా సంతోషంగానే ఉంది. భారీ తేడాను 50 పరుగులకు తగ్గించాం. ముగ్గురు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు జట్టులో ఉంటే విభిన్నమైన పరిస్థితులే ఉంటాయి. కొత్త బ్యాటర్లకు వారితోనే బౌలింగ్ చేయిస్తాం.
క్యాచ్లు వదిలేయడం..
ఇక్కడే ఆట చాలా మారుతోంది. అయితే ఆర్సీబీ బ్యాటర్లు వికెట్లు పడినా తమ అప్రోచ్ను కొనసాగించారు. కీలక సమయాల్లో మేం క్యాచ్లు నేలపాలు చేశాం. క్యాచ్ వదిలిన ప్రతీసారి సిక్స్ లేదా బౌండరీ వచ్చింది. ఈ మూమెంటమ్ ఫైనల్ ఓవర్ వరకు కొనసాగింది. మేం తదుపరి మ్యాచ్ను గౌహతి వేదికగా ఆడనున్నాం. అందుకు అనుగుణంగా మేం సిద్దమవ్వాలి. ఈ రోజు మాకు బ్యాడ్ డే. బ్యాటింగ్, బౌలింగ్లో ఏ మాత్రం కలిసి రాలేదు. మా ఫీల్డింగ్ చాలా మెరుగువ్వాలి.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఇచ్చిన మూడు క్యాచ్లను చెన్నై ఆటగాళ్లు నేలపాలు చేశారు. ఈ అవకాశంతో చెలరేగిన అతను హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. రజత్ పటీదార్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఫిల్ సాల్ట్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 32), విరాట్ కోహ్లీ(30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31) రాణించారు. చివర్లో టీమ్ డేవిడ్(8 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. అనంతరం సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులే చేసి ఓటమిపాలైంది.