
బెంగళూరు: న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న అనాధికారిక మూడో టెస్ట్లో టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్(127 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 108) సెంచరీతో చెలరేగాడు. అతనికి తోడుగా వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్(134 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 76) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఇండియా ఏ తొలి ఇన్నింగ్స్లో 86.4 ఓవర్లలో 293 పరుగులకు కుప్పకూలింది. ఆ వెంటనే అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. న్యూజిలాండ్ -ఏ బౌలర్లలో మాథ్యూ ఫిషర్(4/52) నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. జో వాల్కర్, జకోబ్ డఫ్ఫీ రెండేసి వికెట్లు తీశారు. సీన్ సొలియా, రచిన్ రవీంద్ర తలో వికెట్ పడగొట్టారు.
బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఏకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ ప్రియాంక్ పాంచల్(5), ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(38) త్వరగా ఔటయ్యారు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రజత్ పటిదార్(30)తో రుతురాజ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్(0) ఔటైనా.. ఉపేంద్రయాదవ్తో కలిసి ఐదో వికెట్కు 144 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే అతన్ని ఫిషర్ ఔట్ చేయగా.. భారత వికెట్ల పతనం మొదలైంది. మరో 48 పరుగుల వ్యవధిలోనే భారత్-ఏ మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్(7), రాహుల్ చాహ్(13), సౌరభ్ కుమార్(9), ఉమ్రాన్ మాలిక్(3) దారుణంగా విఫలమయ్యారు.
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే జరిగిన రెండు టెస్ట్లు డ్రాగా ముగిసాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకోనుంది. ఈ టెస్ట్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు అనాధికారిక వన్డేలు జరగనున్నాయి. సెప్టెంబర్ 22, 25, 27 తేదీల్లో ఈ మూడు మ్యాచ్లు చెన్నై వేదికగా జరగనున్నాయి.