'గాశారం బాలేకపోతే తాడే పామై కరుస్తుంది'అంటారు పెద్దలు. టీమిండియా యువ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో రుతురాజ్ గైక్వాడ్ రనౌటయ్యాడు. ఇలా కూడా ఔటవుతారా? అనే రీతిలో అతను పెవిలియన్ చేరాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ రనౌట్ను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్ దరిద్రానికే బ్రాండ్ అంబాసిడర్ అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా మెరుగైన ప్రదర్శన చేసిన రుతురాజ్ గైక్వాడ్కు టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే.

దాంతో అతను మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్(ఎమ్పీఎల్) 2024 సీజన్లో లోకల్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. పుణేరి బప్ఫా జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం రత్నగిరి జెట్స్తో జరిగిన మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ విచిత్రకర రీతిలో పెవిలియన్ చేరాడు.
15 బంతుల్లో ఫోర్, సిక్స్ సాయంతో 29 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్.. క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో రనౌటయ్యాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ తొలి బంతిని మంచి షాట్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్.. డబుల్ రన్ కోసం పరుగెత్తాడు. రెండో రన్ను కూడా విజయవంతంగా పూర్తి చేసేలా కనిపించాడు. కానీ అతని బ్యాట్ దురదృష్టవశాత్తు క్రీజు లైన్ ముందు స్ట్రక్ అయ్యి చేతి నుంచి జారిపోయింది.
అప్పటికే బంతిని అందుకున్న వికెట్ కీపర్ స్టంప్స్ను కొట్టేసాడు. దాంతో రుతురాజ్ గైక్వాడ్ రనౌట్గా వెనుదిరిగాల్సి వచ్చింది. చేతిలో నుంచి బ్యాట్ జారకుండా ఉంటే రుతురాజ్ ఔటయ్యేవాడు కాదు. ఈ మ్యాచ్లో రుతురాజ్ టీమ్ పుణేరి బప్పా 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పుణేరి బప్పా 19.5 ఓవర్లలో 144 పరుగులకు కుప్పకూలింది. అనంతరం రత్నగిరి జెట్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది.