టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తనకు నెల నెలా చెల్లించే రూ. 4 లక్షల భరణం సరిపోవడం లేదని అతని మాజీ సతీమణి హసీన్ జహాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తనకు, తన కుమార్తెకు కోల్కతా హైకోర్టు మంజూరు చేసిన మెయింటెనెన్స్ ఖర్చులను పెంచాలని హసిన్ జహాన్ పిటిషన్ ధాఖలు చేసింది. ఈ పిటిషన్ను స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని మహమ్మద్ షమీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
2014లో హసీన్ జహాన్ను షమీ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2015లో వీరికి ఐరా అనే అమ్మాయి జన్మించింది. 2018 వరకు సాఫీగా సాగిన వీరి సంసారం ఆ తర్వాత కోర్టుకెక్కింది. షమీపై జుగుప్సాకరమైన ఆరోపణలు చేసిన హసీన్ జహాన్.. అతని కుటుంబపై గృహ హింస కేసు పెట్టింది. విడాకులకు కూడా దరఖాస్తు చేసింది.

ఈ ఇద్దరికి విడాకులు మంజూరు చేసిన జిల్లా సెషన్స్ కోర్టు భరణం కింద హసీన్ జహాన్కు నెలకు రూ. 50 వేలు, ఐరాకు రూ. 80 వేల చొప్పున ఇవ్వాలని ఆదేశించగా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆమె కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ మొత్తాన్ని కోర్టు రూ. 4 లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఆ డబ్బులూ సరిపోవడం లేదని ఆమె సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
ఉంపుడు గత్తెలకు లక్షలు తగిలేసే షమీ.. తన కూతురికి మాత్రం డబ్బులు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నాడని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియాలో చోటు కోల్పోయిన షమీ.. దేశవాళీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించినా.. అతనికి టీమిండియాలో అవకాశం దక్కడం లేదు.