రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్గా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 24 బంతుల్లో ఓ సిక్స్, 3 ఫోర్లతో 33 పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. చాహల్ వేసిన 8వ ఓవర్ రెండో బంతిని స్లాగ్ స్వీప్తో భారీ సిక్సర్కు ప్రయత్నించిన కోహ్లీ.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్కు దొరికిపోయాడు. 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ కోహ్లీ 8000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో 4000, 5,500, 6, 000, 6, 500, 7,000, 7,500, 8000 పరుగుల మైలురాళ్లను అత్యంత వేగంగా అందుకున్న బ్యాటర్గా కోహ్లీ గుర్తింపు పొందాడు. కోహ్లీ తర్వాత మరే బ్యాటర్ కూడా కనీసం 7000 పరుగులు చేయలేదు. ఈ సీజన్లో ఇప్పటికే 700 పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ.. 2016 సీజన్లో తన పేరిటనే ఉన్న 973 పరుగుల రికార్డ్ను అధిగమించే దిశగా సాగుతున్నాడు.
ఐపీఎల్ కెరీర్లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 8 శతకాలు నమోదు చేశాడు. 2008 ఏప్రిల్ 18న కేకేఆర్తో జరిగిన మ్యాచ్తో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. చిన్నస్వామి స్టేడియంలోనే 3000 ప్లస్ రన్స్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.